కే భాగ్యరాజ్ కన్నుమూత- విషాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీ
తమిళ చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, స్క్రీన్ప్లే రైటర్ కే భాగ్యరాజ్ గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. భార్య పూర్ణిమ, కుమార్తె శరణ్య భాగ్యరాజ్, కుమారుడు శంతను భాగ్యరాజ్ ఉన్నారు. పూర్ణిమ కూడా నటే. అనేక సినిమాల్లో నటించారు. శంతను కూడా తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. నటుడిగా రాణిస్తోన్నారు. చెన్నైలోని నివాసంలో భాగ్యరాజ్ అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.
దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణించిన అతికొద్ది రోజుల్లోనే భాగ్యరాజ్ కూడా అనంత లోకాలకు వెళ్లడం కోలీవుడ్ను మాత్రమే కాకుండా దక్షిణాది సినీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గురువుగా భావించే భారతీరాజా మరణించిన కొద్ది రోజులకే ఆయన ప్రియ శిష్యుడు భాగ్యరాజ్ కూడా కన్నుమూయడం విషాదకరం. ఆయన మరణం పట్ల కోలీవుడ్, టాలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తోన్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం తెలుపుతున్నారు.

దాదాపు అయిదు దశాబ్దాల పాటు సాగిన కే భాగ్యరాజ్ సినీ ప్రస్థానంలో ఎన్నో మరుపురాని చిత్రాలు ఉన్నాయి. భాగ్యరాజ్ సినీ ప్రస్థానం భారతీరాజా దర్శకత్వంలోనే మొదలైంది. భారతీరాజా మొదటి చిత్రం 16 వయతినిలేలో ఓ చిన్న క్యారెక్టర్ లో నటించారు భాగ్యరాజ్. అది ఆయన కెరీర్ లో మొదటి చిత్రం. ఆ చిత్రానికి సహాయ దర్శకుడిగానూ పనిచేశారు. ఆ తర్వాత 'కిళక్కే పోగుమ్ రైల్' చిత్రానికి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
సిగప్పు రోజాక్కళ్ చిత్రానికి డైలాగ్స్ రాయడమే కాకుండా, అందులో నటించారు. ఆ సినిమా హిట్ కావడంతో ఆయన కేరీర్ మలుపు తిరిగింది. అలాగే టిక్ టిక్ టిక్ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. అనంతరం పూర్తిస్థాయి దర్శకుడిగా ఎదిగారు. సువరిల్లాద చిత్రంగళ్ సినిమాతో మెగాఫోన్ అందుకున్నారు. ఇందులో సుధాకర్, సుమతిలతో పాటు ఆయన కూడా కథానాయకుడిగా నటించారు. మధ్యతరగతి జీవితాలను, చక్కటి హాస్యాన్ని, బలమైన కుటుంబ భావోద్వేగాలను జోడించి విలక్షణమైన కథలతో ఆయన సృష్టించిన సినిమాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
నిత్య జీవితంలో ఎదురయ్యే సాధారణ పరిస్థితులను ఎంతో ఆసక్తికరమైన సినిమాగా మార్చడంలో ఆయనది ప్రత్యేక శైలి. మౌన గీతంగళ్, అంత 7 నాట్కళ్, ముంధానై ముడిచ్చు, చిన్న వీడు వంటి క్లాసిక్ సినిమాలు ఆయన కలం నుండి జాలువారినవే. దాదాపు 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన భాగ్యరాజ్, 75కి పైగా సినిమాల్లో నటుడిగా తన నటనతో మెప్పించారు.
ఆయన చివరిగా తన కుమారుడు శంతను హీరోగా 2010లో సిద్ధు +2 సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత దర్శకత్వానికి విరామం ఇచ్చారు. పలు చిత్రాలలో సహాయక పాత్రలలో నటించారు. ఇటీవల ధనుష్ నటించిన కుబేరాలో ఆయన ఒక కీలక పాత్రలో నటించారు. వెబ్ సిరీస్ ద్వారా సరికొత్త ప్రాజెక్ట్లను పట్టాలెక్కించి త్వరలోనే ప్రేక్షకులను దర్శకుడిగా పలకరించాలని భావిస్తున్న తరుణంలోనే కే భాగ్యరాజ్ ఈ లోకాన్ని విడిచి వెళ్లడం ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటు.












Click it and Unblock the Notifications