'ఓటుకునోటు కేసును పక్కదారి పట్టించేందుకే సెక్షన్ 8'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబుపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో నెల్లూరు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి చేరిపోయారు.
ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకునే సీఎం చంద్రబాబు సెక్షన్ 8ను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేయడం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోవడం అలవాటేనని వ్యాఖ్యానించారు.
శనివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆనం వివేకానంద రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆనం పై వ్యాఖ్యలు చేశారు. మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. అనంతరం ఆలయ అధికారులు మంత్రి కామినేనికి స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.