డిగ్గీ చెంపపై..: జగన్పై భగ్గుమన్న ఇరు ప్రాంతాల కాంగ్రెస్
హైదరాబాద్: తనది కాంగ్రెసు పార్టీ డిఎన్ఏనే అన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ చెంపపై లాగి కొట్టండన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఇరు ప్రాంతాలకు చెందిన కాంగ్రెసు నేతలు భగ్గుమంటున్నారు.
వైయస్ జగన్కు డిఎన్ఏ అంటే అర్థం తెలుసా అని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జగన్ చిన్నా, పెద్దా తేడా లేకుండా మాట్లాడటం ఏమాత్రం సరికాదన్నారు. స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తెలంగాణ అంశాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.

అందరూ అబద్దాలు ఆడుతున్నారని జగన్ అనడం సరికాదని, సీమాంధ్ర ప్రజలు అమాయకులు కాదని, వారు నాయకుల తీరును గమనిస్తున్నారని, డిగ్గీ పైన ఆయన వ్యాఖ్యలు సరికాదని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు అన్నారు. కాంగ్రెసు పార్టీ లేకుంటే వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయి ఉండేవారని, వైయస్ లేకుండా వైయస్ జగన్ లేరని ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు.
దిగ్విజయ్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన సంస్కారాన్ని తెలియజేస్తున్నాయని మంత్రి రఘువీరా రెడ్డి గుంటూరులో అన్నారు. డిగ్గీ వయసుతో పోలిస్తే జగన్ వయసు ఎంత అన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పటికీ కాంగ్రెసువాది అనే భావనతోనే డిగ్గీ అలా మాట్లాడారని, దానిని కూడా తప్పు పడితే ఎలా అని ప్రశ్నించారు. జగన్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే తాము వదిలేస్తున్నామని రఘువీరా అన్నారు.
జగన్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని శాసన మండలి సభ్యుడు షబ్బీర్ అలీ అన్నారు. జగన్ డిగ్గీ పైన చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా రెండు రాష్ట్రాల ఏర్పాటు ఖాయమన్నారు. బిజెపిని కాదన్న చంద్రబాబు మళ్లీ ఆ పార్టీతో ఎలా కలుస్తారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications