అవిశ్వాసానికి రాహుల్ 'సై': జగన్కు ప్లస్, చిక్కుల్లో చంద్రబాబు..
Recommended Video
హైదరాబాద్: కేంద్రంపై పోరాటం నేపథ్యంలో ఏపీ అధికార పార్టీ టీడీపీ బాగానే ఇరుకునపడింది. జగన్ రాజీనామాలు అనగానే.. మీకన్నా ముందు రాజీనామాలకు మేం సిద్దమన్న టీడీపీ నేతలు.. 'అవిశ్వాస తీర్మానం' అనేసరికి మాత్రం అంతా గప్చుప్ అయిపోయారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనకు కాంగ్రెస్ నుంచి కూడా మద్దతు లభిస్తుండటం గమనార్హం.
ఓకె చెప్పిన రాహుల్.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్ కూడా సిద్దమవుతోంది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిసినవేళ.. అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనకు ఆయన ఓకె చెప్పారు.
ఈ బడ్జెట్ సమావేశాల్లోనే:
కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, జేడీ శీలం, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు రాహుల్ గాంధీని కలిసి, కేంద్రంపై అవిశ్వాసం పెడదామని ప్రతిపాదించారు.
అలా చేస్తే.. కేంద్రానికి వ్యతిరేకంగా ఏ పార్టీ కలిసి వస్తుందో ప్రజలకు తెలుస్తుందని చెప్పడంతో, అందుకు రాహుల్ గాంధీ కూడా ఓకె చెప్పారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసం పెట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించినట్టు సమాచారం.
చిక్కుల్లో బాబు..:
అవిశ్వాసానికి కావాల్సినంతమంది ఎంపీలు తమకు లేనందువల్ల టీడీపీని అందుకు ఒప్పించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు జగన్. అయితే ఈ రెండు పార్టీలు కలిసినా.. అవిశ్వాసానికి కావాల్సిన 54మంది ఎంపీల మద్దతు సమకూరదు.
ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసానికి సై అనడం.. జగన్ సవాల్కు గట్టి బలం చేకూరినట్టయింది. అదే సమయంలో సీఎం చంద్రబాబు మరింత చిక్కుల్లో పడ్డట్టయింది.
వెనుక నుయ్యి ముందు గొయ్యి:
వెనుక నుయ్యి ముందు గొయ్యి అన్నట్టుగా తయారైంది చంద్రబాబు ప్రస్తుత పరిస్థితి. అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తే.. ప్రధాని మోడీ చేతిలో ఎక్కడ దెబ్బయిపోతామోనన్న భయం ఒకవైపు, మరోవైపు అవిశ్వాసానికి మద్దతునివ్వక ప్రజల ముందు ఎక్కడ దోషిగా నిలబడుతామేమోనన్న ఆందోళన మరోవైపు.. ఈ రెండింటి నడుమ చంద్రబాబు నలిగిపోతున్నారనే చెప్పాలి.
ఆ సాహసం చేస్తారా?:
ఇప్పటికే కాంగ్రెస్ నేతలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబుకు విదేశాల్లో ముడుపులు ముట్టాయి అని బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
ఆరోపించడమే కాదు ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇలాంటి తరుణంలో మోడీకి వ్యతిరేకంగా వెళ్తే.. తమిళనాడులో శశికళ లాగే చంద్రబాబునూ జైలుకు పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.