కాంగ్రెస్ బలహీనపడింది: బొత్స, సిఎం అరెస్ట్ అని వివేక్
హైదరాబాద్: విభజన నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ బలహీనపడిందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం అన్నారు. అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పాకే విభజన నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం మాటలు మారుస్తున్నాయని మండిపడ్డారు.
ప్రజల మనోభావాలకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకునేలా తమ వంతు ప్రయత్నాలు తాము చేస్తున్నామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెసు పార్టీ ఏ పని చేయదన్నారు. కాంగ్రెసు పార్టీ మినహా అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు.
వ్యక్తిగతంగా తాను సమైక్యవాదిని అన్నారు. అధికారంలో కాంగ్రెసు పార్టీ ఉన్నందువల్లే విభజన నిర్ణయంపై ఇంత చర్చ సాగుతోందని, ఇతర పార్టీ అధికారంలో ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేదన్నారు. 2014 వరకు విడిపోదు అనే వ్యాఖ్యలపై బొత్స భిన్నంగా స్పందించారు.
సిఎంను అరెస్టు చేయాలి
తెలంగాణకు అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని పిడి యాక్టు కింద అరెస్టు చేయాలని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర సమితి నేత వివేక్ వరంగల్లో అన్నారు.
హైదరాబాదులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సభ ఎందుకు పెడుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.