మా వీడియోలు, ఫొటోలు డిలెట్ చేశాం- ప్రాయశ్చిత్తం చేసుకుంటాం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 72,637 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,739 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.51 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 15 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.
కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో నవదంపతుల ఫొటో షూట్ వ్యవహారానికి తెర పడింది. శ్రీవారి ఆలయం ముందు ఫొటో షూట్ నిర్వహించిన తమిళనాడు తిరువణ్ణామలైకి చెందిన తిరుమాల్, గాయత్రీ దంపతులు తమ తప్పు ఒప్పుకొన్నారు. టీటీడీకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పారు. ఆ ఫొటోలు, వీడియోలన్నింటినీ కూడా డిలెట్ చేసినట్లు వెల్లడించారు. స్వామివారిని సేవించుకోవడం ద్వారా తమ తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటామని పేర్కొన్నారు.

తిరుమాల్, గాయత్రి ఇటీవల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణ వేదికలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఆలయ ప్రాంగణంలో ఫొటో షూట్ తీశారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై వివాదం చెలరేగింది. దీంతో టీటీడీ చర్యలకు దిగింది. వారి నుంచి వివరణ కోరింది.
దీనిపై నవదంపతులు స్పందించారు. తప్పును అంగీకరించారు. ఫోటోషూట్ చేయకూడదనే నిబంధన తమకు తెలియదని అన్నారు. ఇది ఆలయ నియమాలకు విరుద్ధమని తెలిసిన వెంటనే ఆ ఫోటోలు, వీడియోలను తొలగించినట్లు చెప్పారు. ఇది అనుకోకుండా జరిగిందని, దీని పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తోన్నామని చెప్పారు. టీటీడీ, శ్రీవారి భక్తులకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరారు. తాము చేసిన తప్పునకు ప్రాయశ్చిత్తంగా, శ్రీవారి సేవా సేవ ద్వారా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దంపతులు తెలిపారు.












Click it and Unblock the Notifications