కోర్టు నో అన్నా తగ్గని జగన్.. పాదయాత్ర చేసితీరుతారట, ఎలా చేస్తారో?
పాదయాత్ర కోసం.. కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని కోర్టు చేప్పిన నేపథ్యంలో ఏదిఏమైనా తాను పాదయాత్ర చేపట్టి తీరుతానంటూ జగన్ ప్రకటించడం.. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యానాలు ఆసక్తికరంగా మారాయి.
అక్టోబర్ 27వ తేదీ నుంచి తను పాదయాత్ర చేపట్టనున్నట్టుగా జగన్ ప్రకటించారు. దీనికోసం వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలంటూ కోర్టుకు వెళ్లగా కోర్టు అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.
అయినా సరే తాను పాదయాత్ర చేపట్టి తీరుతానంటూ జగన్ తాజా ప్రకటించడం.. అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, ఇటు రాజకీయ పరిశీలకుల్లో చర్చనీయాంశంగా మారింది.
పాదయాత్రకు సంబంధించి ప్రణాళికలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత కోర్టు నుంచి అనుమతి తీసుకొనబోయి భంగపడ్డారు. క్విడ్ ప్రో కో కేసుల్లో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.
అయితే తను పాదయాత్ర చేపడుతున్నాను అని, కేసుల విచారణలో వ్యక్తిగత హాజరు విషయంలో తనకు మినహాయింపును ఇవ్వాలని ఇటీవల జగన్ కోర్టును కోరారు. సుదీర్ఘకాలానికి అనుమతిని ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.
అంతేగాక.. విచారణకు హాజరు కాకుండా ఉండటానికే జగన్ పాదయాత్రను చేపడతాను అంటున్నారనే.. వ్యాఖ్యలు కూడా చేశారు న్యాయమూర్తి. ఆ విధంగా కోర్టు అనుమతి దక్కక పాదయాత్ర విషయంలో జగన్ కు ఎదురుదెబ్బ తగిలింది.
అయితే తన పార్టీ కార్యకర్తల సమావేశంలో జగన్ పాదయాత్ర గురించి మరో ప్రకటన చేశారు. కచ్చితంగా పాదయాత్ర చేపడతాను.. అని ఆయన వ్యాఖ్యానించారు. మరి అక్టోబర్ నెలాఖరు అంటున్నారు కాబట్టి.. దానికి కొంత సమయం ఉంది. అప్పటిలోగా జగన్ తన పాదయాత్రకు కోర్టు నుంచి అనుమతి సంపాదిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.