అకారణంగా బయట తిరిగితే కేసులే: ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ, మద్యం షాపుల టైమ్ కుదింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా బుధవారం(మే 5) మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ అమలులోకి రానుంది. అనవసరంగా బయట తిరిగివారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఏపీలో రెండువారాలపాటు కర్ఫ్యూ
ప్రజలంతా స్వచ్ఛందంగా లాక్డౌన్ నిబంధనలను పాటించాలని ఏపీ పోలీసులు విజ్ఞప్తి చేశారు. సంస్థలు, కార్యాలయాలు విధిగా కర్ఫ్యూ ఆంక్షలు పాటించాలని కోరారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వారాలపాటు కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రెండు వారాలు కూడా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే దుకాణాలను అనుమతించనున్నారు.
రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేత
ఇక ఆర్టీసీ బస్సులు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకే సేవలందించనున్నాయి. ఆ తర్వాత ప్రజా రవాణాతోపాటు ప్రైవేటు వాహనాల సేవలు కూడా బంద్ కానున్నాయి. మే 5 నుంచి 12 గంటల తర్వాత రాష్ట్ర సరిహద్దులు కూడా మూసివేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే, అత్యవసర గూడ్స్, అంబులెన్స్ లాంటి వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు.
మద్యం దుకాణాల టైమ్ కుదింపు
మరోవైపు కరోనా కట్టడి చర్యల్లో భాగంగా బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాల వేళలను కుదించారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే మద్యం దుకాణాలు తెరిచి ఉండనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 20,034 పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 82 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 11,84,028కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 8289కి చేరింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,15,784 కరోనా పరీక్షలు నిర్వహించగా ఇప్పటివరకూ 1,68,33,932 కరోనా టెస్టులు నిర్వహించారు. మరో 12,207 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం10,16,142 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,59,597 యాక్టివ్ కేసులు ఉన్నాయి.