మోడీ మనసు వైసీపీలో.. తనువు టీడీపీలో?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ముంచుకొచ్చేస్తోంది. అదేరోజు లోక్ సభ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలవరించాలనే ఉద్దేశంతో తెలుగుదేశం, జనసేన.. భారతీయ జనతాపార్టీతో కలిసి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగాయి. 2019 ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి వచ్చాయి. కనీసం ఒక్క శాతం ఓటుబ్యాంకు కూడా లేని బీజేపీకి ఆరు లోక్ సభ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించి పెద్ద సాహసమే చేస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్న ఒప్పందంతోనే బీజేపీకి ఈ సీట్లు కేటాయించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్టీల్లో పెరుగుతున్న అసహనం
రోజులు గడిచేకొద్దీ కూటమిలోని తెలుగుదేశం, జనసేన నేతల్లో అసహనం పెరిగిపోతోంది. బీజేపీకి సీట్ల త్యాగంద్వారా తాము కోరుకున్నది లభించడంలేదనే అసంతృప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకరిద్దరు అధికారులను విధుల నుంచి తప్పించారుకానీ తాము కోరుతున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇన్ ఛార్జి డీజీపీ బదిలీ మాత్రం జరగడంలేదనే అసహనంతో ఈ రెండు పార్టీలు ఉన్నాయి. పుంగనూరులో దాడులు, పల్నాడులో ఉద్రిక్తతలు, రాష్ట్రవ్యాప్తంగా మద్యం డంప్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని, పింఛన్ల విషయమై సీఎస్ కుఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడంలేదని ఇరు పార్టీల నేతలు మండిపడుతున్నారు.

మౌనమే సమాధానం
డీజీపీ శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని, ఆయన్ని మార్చాలని కోరుతున్నప్పటికీ కేంద్రం నుంచి సమాధానం రావడంలేదు. మరోవైపు గాజుగ్లాసు గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ బీజేపీ నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. గాజుగ్లాసును జనసేనకు రిజర్వు చేసిన తర్వాత స్వతంత్రులకు కేటాయించకూడదు. కానీ కేటాయించారు. దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈసీ ఆదేశాలివ్వడంలేదన అసంతృప్తి నేతల్లో కనపడుతోంది. బీజేపీ నుంచి వీరు కోరుకున్న సహకారం మాత్రం లభించడంలేదు. నరేంద్రమోడీ, అమిత్ షా మనసు వైసీపీవైపు ఉన్నట్లుందని, తనువు మాత్రం టీడీపీ, జనసేనవైపు మరోచోట ఉందనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళుతున్నప్పటికీ మిత్రపక్షంగా అందించాల్సిన సహకారం మాత్రం బీజేపీ నుంచి కొరవడుతోందని తెలుగుదేశం, జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications