పురంధేశ్వరికి ప్రమోషన్?: బాబును తిట్టేందుకా లేక బీజేపీ బలోపేతానికా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ కొత్త రాజకీయాలకు తెరలేపనుందా? కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేసిన రాష్ట్ర విభజన అనంతరం బీజేపీలో చేరిన దగ్గుబాటి పురంధేశ్వరికి ప్రమోషన్ కల్పించనుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ బలం పుంజుకోడానికి పురంధేశ్వరిని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుందని సమాచారం.
ఇందులో భాగంగా మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరికి బీజేపీ జాతీయ మహిళా మోర్చా పదవి కట్టబెట్టనున్నారని తెలుస్తోంది. ఇదే గనుక జరిగితే 2019 అసెంబ్లీ ఎన్నికలనాటికి ఏపీలో బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో బీజేపీ, టీడీపీల మధ్య సఖ్యత కూడా ఏమతం బాగాలేదు.
ఏపీలో టీడీపీ, బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ, ఆ రెండు పార్టీల నేతలు మాత్రం అంతగా కలిసిపోయినట్లు కనిపించడం లేదు. బీజేపీకి చెందిన మంత్రి మాణిక్యాలరావు ఇటీవలే ఓ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతపై సవాల్ విసిరడమే ఇందుకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ నిధులు ఇస్తున్నప్పటికీ టీడీపీ మాత్రం ఆ విధంగా ప్రస్తావించకపోవడంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఇటీవల రాజమహేంద్రవరంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు సైతం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ పూర్తి సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. 2019 ఎన్నికలకు బీజేపీని సంస్ధాగత స్థాయిలో పూర్తిగా బలపరచేందుకుగాను అమిత్ షా తన వ్యూహాంలో భాగంగానే పురంధేశ్వరికి బీజేపీ జాతీయ మహిళా మోర్చా పదవిని కట్టబెట్టనున్నారని సమాచారం.
టీడీపీకి ధీటుగా ఏపీలో బీజేపీ బలపడాలంటే పురంధేశ్వరే సరైన వ్యక్తి. ఎన్టీ రామారావు కుమార్తెగా దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు. అంతేకాదు టీడీపీని తిట్టిపోయడంలో పురంధేశ్వరి దిట్ట. గతంలో కూడా పలుమార్లు టీడీపీ ప్రభుత్వ తీరుని ఆమె ఎండగట్టారు.
పురంధేశ్వరికి పార్టీలో ప్రమోషన్ కల్పిస్తే భవిష్యత్తులో మరింత దూకుడు ప్రదర్శిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం బీజేపీలో సాధారణ కార్యకర్తగా ఉన్న పురంధేశ్వరికి జాతీయ పదవి కూడా వచ్చిందంటే.. చంద్రబాబుపై తన మాటల దాడులను మరింతగా పెంచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.












Click it and Unblock the Notifications