రేవులో మృత్యువుతో దోబూచులాట! ఏ క్షణమైనా పెనుప్రమాదం?
గలగల పారే గోదారమ్మపై ఎప్పుడు మృత్యువు విలయతాండవం చేస్తుందో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే గతంలో గోదావరి నదిపై జరిగిన ఘోర పడవ ప్రమాదాలు అలాంటివి. వందలాది కుటుంబాల్లో నింపిన శోకం ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి. అయినా సరే, కొందరు నిర్వాహకులకు భయం లేదు.. అధికారులకు అస్సలు పట్టడం లేదు! డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం సోంపల్లి వద్ద వశిష్ట గోదావరి నదిపై సాగుతున్న పడవ ప్రయాణాలు ఇప్పుడు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లైఫ్ జాకెట్లు లేవు.. రాత్రి వేళల్లోనూ యథేచ్ఛగా..
నదీ ప్రయాణాల్లో ప్రయాణికుల భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ పరికరాలు లైఫ్ జాకెట్లు. కానీ, సోంపల్లి రేవులో నడుస్తున్న పడవల్లో కనీసం ఒక్కటంటే ఒక్క లైఫ్ జాకెట్ కూడా అందుబాటులో లేకపోవడం గమనార్హం. నదిలో ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు కాపాడే ప్రత్యామ్నాయ మార్గమే ఇక్కడ లేదు. ఇది చాలదన్నట్లు, సూర్యాస్తమయం తర్వాత నదీ ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు ఉండవు. కానీ, ఇక్కడ చీకటి పడిన తర్వాత కూడా ప్రమాదకరమైన రీతిలో, నడిరాత్రి వేళల్లో సైతం పడవ ప్రయాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి.

సామర్థ్యానికి మించి లోడింగ్.. పంటుకు బదులు చిన్న పడవలు!
సోంపల్లి రేవు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం వరకు నిత్యం వందలాది మంది ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ మార్గంలో నిబంధనల ప్రకారం సురక్షితమైన 'పంటు' (పెద్ద ఫెర్రీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ, నిర్వాహకులు మాత్రం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల కోసం ప్రమాదకరమైన చిన్న ఇంజన్ పడవలను నడుపుతున్నారు. దీనికి తోడు, పడవల సామర్థ్యానికి మించి ప్రయాణికులను, బైకులు, ఇతర భారీ వస్తువులను ఇష్టారాజ్యంగా ఎక్కిస్తూ మృత్యువుతో దోబూచులాడుతున్నారు.
సీజ్ చేసినా ఆగని అక్రమ దందా!
ఈ రేవుకు సంబంధించి గతంలో సరైన అనుమతులు లేని కారణంగా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కఠిన చర్యలు తీసుకున్నారు. రేవును పూర్తిగా మూసివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, అధికారుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, చట్టాన్ని లెక్కచేయకుండా నిర్వాహకులు తిరిగి పడవ రాకపోకలను ప్రారంభించడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంత జరుగుతున్నా స్థానిక యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.
తక్షణమే స్పందించాలి..
ఏ క్షణంలో ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియక భయం గుప్పిట్లో ప్రయాణిస్తున్న భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగి, అమాయకుల ప్రాణాలు గాల్లో కలవకముందే.. జిల్లా యంత్రాంగం, పోర్టు శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు. ఇక్కడి అక్రమ పడవ ప్రయాణాలను అరికట్టి, నిబంధనల ప్రకారం సురక్షితమైన ప్రయాణ సౌకర్యాలు కల్పించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.














Click it and Unblock the Notifications