తప్పు చేశా, వాళ్లు తప్పులు చేసి బురద చల్లారు: దాసరి
హైదరాబాద్: రాజకీయాల్లో చేరినందుకు ప్రముఖ తెలుగు సినీ దర్శక నిర్మాత, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణ రావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చిత్రపరిశ్రమలో దర్శకరత్నగా వెలుగొందుతూ రాజకీయాలలో అడుగుపెట్టి చాలా పెద్ద తప్పు చేశానని ఆయన అన్నారు. రాజకీయాలలో వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తనపై బురద చల్లారని ఆయన అన్నారు.
సోమవారం సాయంత్రం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన దాసరి 71వ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఆయన మాట్లాడారు. తన మనస్సులోని మాటను బయటపెట్టారు.

రాజకీయాలలో తప్పులు జరుగుతూనే వుంటాయి కానీ తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తనపై నిందలు వేశారని ఆయన అన్నారు. అది బురదే కదా కడుగేసుకుంటే పోతుందని అనుకున్నాను కానీ అది బురదకాదు తారు అని గమనించాను అయినా కడుక్కున్నానని అన్నారు.
ఎవరినో కాపాడటానికి తనను బలిపశువుగా వాడుకున్నారని, నిందలు కలకాలం వుండవని దాసరి అన్నారు. తానేమిటో నిరూపించుకునే రోజు అతి త్వరలోనే వస్తుందని, తనపై పడిన మచ్చను కడుక్కుంటానని తన సత్తా చూపిస్తానని దాసరి నారాయణరావు అన్నారు. ఈ మాటలు అంటున్నప్పుడు ఆయన తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు కనిపించారు.
బొగ్గు కుంభకోణం కేసులో దాసరి నారాయణ రావు ఇరుకున్న విషయం తెలిసిందే. యుపిఎ ప్రభుత్వ హయాంలో సహాయ మంత్రిగా పనిచేసిన ఆయనను ఆ కుంభకోణం చుట్టుముట్టింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు కనిపించారు.












Click it and Unblock the Notifications