ఓటుకు నోటుపై దద్దరిల్లిన సభ, టీఆర్ఎస్కు వైసీపీ తోక పార్టీలా వ్వవహారిస్తోంది: కాల్వ
హైదరాబాద్: ఐదోరోజు శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే ఓటుకు నోటు కేసుపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించారు. ప్రశ్నోత్తరాలను స్పీకర్ కోడెల ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్సించొద్దని స్పీకర్ కోడెల వైసీపీ సభ్యులకు సూచించారు.
అనంతరం మాట్లాడిన వైసీపీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్ని అంశాలపై చర్చించేందుకు సమావేశాల గడువు పొడిగించాలని కోరారు. బీఏసీలో నిర్ణయం మేరకే సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసుపై చర్చకు అనుమతించాల్సిందేనంటూ వైయస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది.
వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం ఆంధ్రప్రదేశ్కు సంబంధం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే వైసీపీ సభలో ఆందోళన చేస్తోందని అన్నారు. అనవసర ఆరోపణలతో దగుల్బాజీ రాజకీయాలు చేస్తూ, వైకాపా సభను తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా, కుట్రలు చేసి తమ నేతను కేసులో ఇరికిస్తే వారికి వైకాపా వంతపాడుతోందని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్కు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోక పార్టీగా వ్యవహారిస్తోందనిదుయ్యబట్టారు. తమ నేత చంద్రబాబు నీతి, నిజాయితీలకు మారుపేరని, జగన్ లాగా కేసుల్లో ఇరుక్కుని జైలుకు పోలేదని అన్నారు.