మహిళల కష్టాన్ని చూసి...ఆ పని చేయాలని చిన్నప్పుడే డిసైడ్ అయ్యా: సిఎం చంద్రబాబు
అమరావతి:మహిళల పట్ల సమాజంలో నిర్లక్ష్యాన్ని చిన్నతనంలోనే గమనించిన తాను...మహిళ ఆర్థికంగా అశక్తురాలిగా ఉండటం వల్లే వారికి ఆనాడు ఆ దుస్థితి అని అర్థం చేసుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సాధికారమిత్రలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మహిళ సమస్యలు...ఆర్థికాభివృద్ది గురించి వారితో మాట్లాడారు. మహిళల సమస్యలు తీరాలంటే వారు శక్తివంతులుగా మారాలంటే ఆర్థికాభివృద్దిలో భాగం కావాలని ఆనాడే అనుకున్నానని చంద్రబాబు తెలిపారు. అలాగే వంటింట్లో మహిళలు పడుతున్న కష్టాన్ని చూసే 'దీపం' పథకాన్ని ప్రవేశపెట్టానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

ఆత్మవిశ్వాసమే మహిళలను ముందుకు తీసుకువెళ్లే మార్గమని తాను భావించినట్లు చంద్రబాబు వెల్లడించారు. అందులో భాగంగానే పొదుపు సంఘాలను ప్రోత్సహించానని చంద్రబాబు తెలిపారు. అంతేకాకుండా కుటుంబ నియంత్రణ ప్రోత్సహించడానికి మహిళా సంఘాలతోనే ప్రచారం చేయించానని చెప్పారు.అలాగే డ్వాక్రా సంఘాలు దేశంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగాయని చంద్రబాబు వివరించారు. గత పదేళ్ల పాటు నిర్వీర్యమైపోయిన డ్వాక్రా సంఘాలకు తిరిగి తాము ప్రాణం పోశామన్నారు.
అలాగే మహిళలకు మైక్రో ఫైనాన్స్ బెడద లేకుండా తరిమికొట్టామని చెప్పారు. ఆ క్రమంలోనే ఈ ఏడాది రూ.14 వేల కోట్ల రుణాలు ఇచ్చామని తెలిపారు. అంతేకాకుండా రూ.52 వేల కోట్లిచ్చి మహిళా సంఘాలను ప్రోత్సహించామని తెలిపారు. ఆర్థిక అసమానతలను తగ్గించే సమాజం కోసం తాను కృషి చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications