వినుకొండలో డీఈడీ విద్యార్ధుల రాస్తారోకో: మోసం చేసి కాలేజీల్లో చేర్చుకున్నారని ఆవేదన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డీఈడీ పరీక్షలు మొదలయ్యాయి. అయితే మరికొద్దిసేపట్లో పరీక్ష రాయాల్సి ఉన్నా హాల్ టిక్కెట్లు ఇవ్వనందుకు గాను నిరసనగా సోమవారం ఉదయం డీఈడీ విద్యార్ధులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు.
గుంటూరు జల్లాలోని వినుకొండ పట్టణంలో జీఎస్ఆర్ డీఈడీ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేప్టటారు. కొద్దిసేపట్లో పరీక్షలు రాయాల్సి ఉన్నా తమను పరీక్షలు రాయనివ్వడం లేదని ప్రిన్సిపల్ చాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. గుర్తింపు లేని కాలేజీల్లో తమను మోసం చేసి చేర్చుకున్నారని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.

పరీక్షలు రాసేందుకు కాలేజీకి వెళితే కాలేజీలో క్లాస్రూమ్లకు వెళితే తాళాలు వేసి ఉన్నాయని విద్యార్ధులు వాపోయారు. ఇలాంటి డీఈడీ కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కళాశాల యాజమాన్యం విద్యార్ధులను మోసం చేస్తుందంటూ కాలేజీకి వ్యతిరేకంగా విద్యార్ధులు పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఇదే విధంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో కూడా జరిగింది. ఒంగోలులోని పేర్నమిట్ట వెంకటసాయి డీఈడీ కాలేజీ, ఎన్.ఆగ్రహారంలోని లిటిల్ స్టార్ డీఈడీ కాలేజీలకు చెందిన సుమారు 40 మంది పరీక్ష కేంద్రమైన కర్నూలు రోడ్డులో ఉన్న జేవియర్ కళాశాల వద్ద రాస్తారోకో చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో విద్యార్థుల ధర్నా
అనంతపురం జిల్లాలోని శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులు సోమవారం భారీ ధర్నాకు దిగారు. కాంట్రాక్టు ఉద్యోగాల క్రమబద్ధీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా విద్యార్ధులు ఈ ధర్నా చేపట్టారు. యూనివర్సిటీకి సమీపంలోని జాతీయ రహదారిపై బైఠాయించి విద్యార్ధులు ధర్నా చేశారు.
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాతో రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications