ఏపీపై వాయుగుండం పంజా: తీరం దాటేది ఇక్కడే
Heavy Rains in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా మారింది. తీరం వైపు తరుముకొస్తోంది. వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తమిళనాడు ఉత్తరం- ఏపీ దక్షిణ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందని తెలిపింది.
దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. అటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపైనా ప్రతాపం చూపుతున్నాయి. అల్పపీడనం తీరానికి తీరం వైపు కదులుతున్న కొద్దీ వర్షాల తీవ్రత అధికమౌతూ వస్తోంది.

ప్రస్తుతం ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. క్రమంగా ఇది వాయవ్య దిశగా కదులుతోంది. ఆ సమయంలో దీని వేగం గంటకు 10 కిలో మీటర్లు. ఈ తెల్లవారు జాము నాటికి చెన్నైకి 440, పుదుచ్చేరికి 460, నెల్లూరుకు 530 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గురువారం తెల్లవారు జామున పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
దీని ప్రభావంతో ఏపీలో ఇప్పటికే అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలు తడిచి ముద్దయ్యాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులు సైతం పడ్డాయి.
నేడు, రేపు కూడా ఇవే తరహా పరిస్థితులు ఉండనున్నాయి. ఉత్తరాంధ్ర మొదలుకుని రాయలసీమ వరకు భారీ వర్షాలు అసాధారణ వర్షపాతం నమోదు కావడానికి అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి.












Click it and Unblock the Notifications