అభ్యంతరాల్లేవ్.. నెహ్రూ చేరిక ఖాయం! : పుష్కరాల తర్వాత ముహూర్తం
విజయవాడ : విభజన నేపథ్యంలో ఏపీ రాజకీయాలకు కేరాఫ్ గా మారిన బెజవాడలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మాజీలుగా మిగిలిపోయిన కొంతమంది నేతలు అధికార పార్టీ వైపు దృష్టి సారించడంతో.. వారిని పార్టీలో చేర్చుకుని బెజవాడ రాజకీయాలను మరింత బలోపేతం చేసుకోవాలనే యోచనలో అధికార టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే.. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ పార్టీ మార్పుపై గతకొంతకాలంగా చర్చలకు దాదాపుగా తెరపడింది. బుధవారం నాడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావుతో భేటీ అయిన నెహ్రూ.. టీడీపీలో చేరడానికి ముహూర్తం ఖాయం చేసుకునే పనుల్లో ఉన్నట్లు సమాచారం.

నెహ్రూ పార్టీలోకి వస్తే.. ఇతర నేతల నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తాయా.. అన్న కోణంలోను ఆలోచించిన అధ్యక్షడు కళావెంకట్రావు.. నెహ్రూ చేరికపై పలువరు నేతలతో సంప్రదింపులు జరిపారు. మంత్రి దేవినేని ఉమ, ఎమ్మెల్యే బొండా ఉమ, గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని నాని సహా తదితర నేతల అభిప్రాయాలను తెలుసుకున్న కళావెంకట్రావు.. నేతలెవరు అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో నెహ్రూతో భేటికి ఓకె చెప్పారు.
నేతల నుంచి ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తమవకపోవడంతో.. ఇక సీఎం చంద్రబాబుతో నెహ్రూ భేటీ లాంఛనంగానే కనిపిస్తోంది. అయితే పార్టీలో చేరిక మాత్రం పుష్కరాల తర్వాతే ఉంటుందని తెలుస్తోంది. దీంతో నెహ్రూతో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో తెలుగుదేశం కండువా కప్పుకోవడానికి సిద్దమవుతున్నారు. నెహ్రూతో పాటు ఆయన కుమారుడు, యువజన కాంగ్రెస్ నేత దేవినేని అవినాష్ కూడా టీడీపీలో చేరడం ఖాయంగానే కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications