వద్దని బొత్సపై దేవినేని, అంతా సీఎంలని కేసీఆర్పై సర్వే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక విషయంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ మాజీ అద్యక్షులు బొత్స సత్యనారాయణ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే సహించబోమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆదివారం అన్నారు. చౌకబారు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
రాజధానిని ఇంకా ఎంపిక చేయకుండానే ముఖ్యమంత్రి పైన ఆరోపణలు చేయడం ఏమాత్రం తగదన్నారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని రాజధానిని ఎంపిక చేస్తామని చెప్పారు. ఎవరికో అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే తత్వం చంద్రబాబుది కాదన్నారు. ఏకపక్షంగా రాష్ట్ర విభజన చేసి కాంగ్రెసు పార్టీయే ప్రజలకు తీర అన్యాయం చేసిందన్నారు.
ఆ కుటుంబంలో అందరు సీఎంలే: సర్వే
కేసీఆర్ కుటుంబంలో అందరు ముఖ్యమంత్రులేనని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సిద్దిపేటలో అన్నారు. కూతురు, కొడుకు, మేనల్లుడుల కనుసన్నుల్లోనే పాలన సాగుతోందన్నారు.
అధికారంలోకి వచ్చాక తెరాస ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు అయినా మంజూరు చేసిందా అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సాగుకు ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తే.. తెరాస కనీసం అయిదు గంటలు కూడా ఇవ్వడం లేదని శ్రీధర్ బాబు అన్నారు.