కిరణ్ రెడ్డి హీరో, చంద్రబాబు జీరో: దేవినేని నెహ్రూ
విజయవాడ: ప్రజల కోసం సిడబ్ల్యుసి నిర్ణయాన్ని వ్యతిరేకించి, పదవీ త్యాగం చేయడానికి సిద్ధపడ్డ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సమైక్యాంధ్ర హీరో అని కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూ కొనియాడారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆయన జీరోగా అభివర్ణించారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి నిర్ణయాన్ని తిరిగి రాయాలని జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కోరుతున్నారని, దీనిపై మిగతా పార్టీలు ఎందుకు అడగడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలోనూ తెలుగు ప్రజలు ఉన్నారు.. సమైక్యాంధ్రలోనూ తెలుగు ప్రజలు ఉన్నారని...చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర ఎవరికోసం అని ప్రశ్నించారు.
తాను సమైక్యవాదనికి కట్టుబడి ఉన్నానని లేదా తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నానని చంద్రబాబుతో ఆ పార్టీ నేతలు ఒక్క మాట అనిపించగలరా అని నెహ్రూ అడిగారు. దొంగదారుల్లో వెళ్లి కాంగ్రెస్పై బురద చల్లడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణపై ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకునేలా ఆ పార్టీ నేతలు ఒత్తిడి తేవాలన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ శాసనసభ్యులు రాజీనామాలు చేయొద్దని... అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించాల్సింది మీరే అని ఆయన అన్నారు. రాజీనామాలు చేస్తే రాష్ట్ర విభజనకు సహకించినట్టే అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాటలో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరారు. రాజీనామా చేస్తే రాష్ట్రపతి పాలన పెట్టి గవర్నర్ ద్వారా విభజన ప్రక్రియ చేస్తారన్నారు. రాష్ట్ర సమైక్యతను కాపాడాలంటే రాజీనామా చేయవద్దని 9 కోట్ల ప్రజానీకం చేతులె త్తి మొక్కుతున్నామని దేవినేని నెహ్రూ తెలిపారు.