'కేంద్రంపై ఒత్తిడి, జగన్ అనుమతితోనే కారెక్కిన పొంగులేటి'
విజయవాడ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో వైసిపి అధినేత జగన్ కుమ్మక్కయ్యారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. ప్రాజెక్టుల విషయమై తాము కేంద్రం పైన ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు. అనుమతితోనే ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టాలన్నారు.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకమంటూ జగన్ ఓ వైపు దొంగ దీక్షలు చేస్తూ, ఆ ప్రాజెక్టు పనులను తెలంగాణలోని వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చేలా చేశారని ధ్వజమెత్తారు. జగన్ జల దీక్ష హాస్యాస్పదమని, రాష్ట్రానికి నీరు రాకుండా మరో కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
గీసిన గీత దాటని జేబులోని నేతను ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం తెరాసలో కావాలని చేర్చిన జగన్, ఇప్పుడు అక్రమ ప్రాజెక్టులంటూ దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు. తెరాసలో పొంగులేటి చేరడాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పొంగులేటి ఆ పార్టీలో చేరాడన్నారు.

అందుకు ప్రతిగా పలువురు వైసిపి నేతలకు కేసీఆర్ ప్రాజెక్టు కాంట్రాక్టులు ఇచ్చాడని ఆరోపించారు. ఓ వైపు కాంట్రాక్టులను పొందుతూ, మరోవైపు కర్నూలులో దీక్ష చేస్తాననడం జగన్నాటకమని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులను కలిసిన జగన్ ఏం సాధించాడని ప్రశ్నించారు. రాష్ట్రానికి హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు.
కాగా, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను తెరాసలోకి వెళ్లే ముందు వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన విషయం తెలిసిందే. జగన్ను కలిసిన అనంతరం ఆ తర్వాత ఆయన తెరాసలో చేరారు. ఇదే విషయాన్ని టిడిపి నేతలు ప్రస్తావిస్తున్నారు. జగన్ అనుమతితోనే కారు ఎక్కారని అంటున్నారు.












Click it and Unblock the Notifications