బాబు చేసిన మోసం ఎవరూ చేయలేదు: ధర్మాన
హైదరాబాద్: రైతులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన మోసం ఎవరూ చేయలేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. రైతుల రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఎలుగెత్తి చాటేందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు దీక్ష చేస్తున్నారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
హామీల పరంపరతో అధికారంలోకి వచ్ిచన చంద్రబాబు ఆ తర్వాత రైతులను, డ్వాక్రా మహిళలను, అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురి చేస్తున్నారని, చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికే జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు తీరుపై, ప్రభుత్వ విధానాలపై సమరశంఖం పూరించేందుకు వైయస్ జగన్ తణుకులో రైతుల దీక్షకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు.

తమ పార్టీ రైతుల వెంటే ఉందని, ప్రధాన ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర నిర్వహిస్తామని ఆయన చెప్పారు. మోసం చేసిన ప్రభుత్వాన్ని, పార్టీలను వ్యతిరేకిద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దావోస్, సింగపూర్, జపాన్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎంత మంది రైతులకు రుణమాఫీ చేశారని ఆయన అడిగారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 31వ తేదీన, ఫిబ్రవరి 1వ తేదీన తణుకులో దీక్ష చేపట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఆయన ఈ దీక్ష చేయనున్నారు.
కేంద్ర మంత్రులే ఆక్రమించారు
ఇదిలావుంటే, కృష్ణానది కరకట్టను ఎంపిలు, కేంద్ర మంత్రులే ఆక్రమించారని సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవి రాఘవులు ఆరోపించారు. కరకట్ట ఆక్రమణలపై చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఆయన బుధవారం విజయవాడలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై రాష్ట్రాలు తమ వైఖరి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్తు చార్జీలు పెంచితే సహించేది లేదని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications