ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..! డీఏ పెంపు ఇలా..!
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవాళ ఓ శుభవార్త అందింది. ఈసారి కరువు భత్యం పెంపు (DA Hike)పై క్లారిటీ వచ్చింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు వీలుగా ఈసారి కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూలై 1 నుంచి ఈ డీఏ పెంపు అమలులోకి రానుంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డీఏ మూల వేతనంలో (Basic Bay) 60 శాతంగా ఉంది. తాజా పెంపుతో ఇది 63 శాతానికి చేరబోతోంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఈ డీఏ శాతాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తుంది. కేంద్రం సాధారణంగా ప్రతి ఏటా జనవరి 1, జూలై 1 తేదీల నుంచి అమల్లోకి వచ్చేలా రెండుసార్లు డీఏను సవరిస్తుంది. గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జూన్ వరకు పన్నెండు నెలల కాలంలోని వినియోగదారుల ధరల సూచీ సగటు ఆధారంగా ఈ లెక్కింపు చేస్తారు.

ఏడో వేతన సంఘం నిర్దేశించిన లెక్క ప్రకారం డీఏ దాదాపు 63.7 శాతానికి చేరింది. అయితే దశాంశ పాయింట్లను మినహాయించే సాంప్రదాయం ఉండటంతో ప్రభుత్వం దీనిని 63 శాతంగా ఖరారు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇప్పుడు పెరిగే 3 శాతం డీఏ వల్ల ఉద్యోగుల కనీస వేతనం ఆధారంగా జీతాలు పెరగబోతున్నాయి. మూల వేతనం 18వేల రూపాయలు ఉన్న ఉద్యోగికి నెలవారీ జీతంలో 540 రూపాయలు పెరుగుతాయి. అలాగే బేసిక్ పే 30 వేల రూపాయలు ఉన్న వారికి ప్రతి నెలా 900 రూపాయలు, ఒకవేళ బేసిక్ పే 50 వేల రూపాయల వరకు ఉంటే వారికి దాదాపు 1,500 రూపాయల చొప్పున పెరగనుంది. కేంద్ర ఉద్యోగులతో పాటు సమానంగా పెన్షనర్లకు కూడా ఈ 3 శాతం డీఆర్ (DR) ప్రయోజనం లభిస్తుంది. ఇప్పటికే 8వ వేతన సంఘం అమలు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ 3 శాతం పెంపు కొంతమేర ఊరటనిస్తుందని చెప్పవచ్చు.













Click it and Unblock the Notifications