ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు 100 రోజుల్లో మొత్తం రూ. 6,000 కోట్ల బకాయిలను పూర్తిగా విడుదల చేసింది. తాజాగా మరో రూ.2 వేల కోట్లు విడుదలయ్యాయి.
ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో 100 రోజుల్లోనే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలు విడుదల చేసి మాట నిలబెట్టుకుంది.

ఈ మేరకు రేవంత్ సర్కార్ మూడు విడతల్లో ఉద్యోగుల బకాయిలు పూర్తిగా చెల్లించింది. మొదటి విడతగా మే 29న రూ. 2,000 కోట్లు రిలీజ్ చేసింది. ఆ తర్వాత రెండో విడతగా జూన్ 30 న రూ.2,000 కోట్లు విడుదల చేయగా.. తాజాగా మూడో విడతగా మరో రూ. 2,000 కోట్లను విడుదల చేసి ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. ఇక ఈ విడుదలతో విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలు పూర్తిగా చెల్లించబడ్డాయి. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగ జేఏసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications