జగన్ పార్టీలో టిక్కెట్ల రగడ, చల్లబడిన గుర్నాథ్ రెడ్డి

గుంటూరు తూర్పు నియోజకవర్గం పార్టీ అభ్యర్థిగా ముస్తఫా పేరును ఖరారు చేసినట్లు వచ్చిన సమాచారంతో జిల్లాలో అసంతృప్తి రగిలింది. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆశావహులు మంగళవారం రాత్రి స్థానిక మాయాబజార్ సెంటర్లో రాస్తారోకోకు దిగారు. తర్వాత పార్టీ నగర కన్వీనర్, ఇతర నేతల ఇళ్ల వద్ద కూడా ధర్నా చేశారు.
తమకు సీట్లు కేటాయించకుంటే తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు రోడ్ల పైకి చేరి పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విశాఖ జిల్లాలో జగన్ పార్టీ ఎంపీ అభ్యర్థులు దాదాపుగా ఖరారయ్యారు. విశాఖ పార్లమెంటు స్థానానికి వైవి సుబ్బారెడ్డి, అనకాపల్లి ఎంపీ స్థానానికి గుడివాడ అమర్నాథ్ల అభ్యర్థిత్వాలను పార్టీ అద్యక్షులు జగన్మోహన్ రెడ్డి పరిశీలిస్తున్నారు.
చల్లబడ్డ గుర్నాథ్
అనంతపురం జిల్లా ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి కలకలం సృష్టించారు. వైయస్ కుటుంబానికి వీరాభిమానిగా ముద్ర వేసుకున్న అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పార్టీ వీడుతున్నారనే వార్త సంచలనం రేకెత్తించింది. దీంతో పార్టీ జిల్లా ఇన్చార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని అధిష్ఠానం.. రాయబారిగా పంపింది. పెద్దిరెడ్డి.. గుర్నాథరెడ్డిని శాంతపరిచే ప్రయత్నం చేశారు. దీంతో తాను పార్టీలో కొనసాగుతానని గుర్నాథరెడ్డి మీడియాకు వివరించడంతో ఉత్కంఠకు తెరపడింది.












Click it and Unblock the Notifications