రెండు ఉప ఎన్నికలు: వైఎస్ జగన్-చంద్రబాబు మధ్య తేడా ఇదీ: వ్యతిరేకత సోకని పాలన
అమరావతి: ఊహంచినట్టే- తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి, ప్రముఖ ఫిజీషియన్ డాక్టర్ గురుమూర్తి ఘన విజయాన్ని సాధించారు. 2.60 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీని అందుకున్నారు. ఇది- 2019లో ఇదే వైఎస్ఆర్సీపీ సాధించిన మెజారిటీ కంటే అధికం. తెలుగుదేశం పార్టీ సైతం ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. అనూహ్యంగా పుంజుకోగలిగింది. ఎటొచ్చీ- ఈ స్థానాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భారతీయ జనతాపార్టీకి కోలుకోని దెబ్బ కొట్టింది ఈ ఉప ఎన్నిక. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.
Recommended Video

అడుగు బయట పెట్టకుండా..
ఈ ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ తరఫున.. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి రాలేదు. తన క్యాంప్ కార్యాలయం నుంచి అడుగు తీసి బయట పెట్టలేదు. పార్టీ అభ్యర్థిని గెలిపించే బాధ్యతను ఆయన మంత్రులు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన నాయకులకు అప్పగించారు. ప్రచారం ముగియడానికి ఒక్కరోజు తిరుపతిలో బహిరంగ సభను నిర్వహించాలని వైఎస్ జగన్ భావించినప్పటికీ- కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ సభను రద్దు చేసుకున్నారు. జగన్ నిర్ణయంపై టీడీపీ విమర్శలు గుప్పించింది.

పగలు, రాత్రీ ప్రచారం..
తెలుగుదేశం పార్టీ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ సహా పలువురు నాయకులు తిరుపతిలో మకాం వేశారు. పార్టీ అభ్యర్థిని, కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని గెలిపించడానికి సర్వశక్తులూ ఒడ్డారు. తిరుపతి లోక్సభ పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి, సూళ్లూరుపేటల్లో విస్తృతంగా పర్యటించారు. చంద్రబాబు, నారా లోకేష్ స్వయంగా ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగారు. అయినప్పటికీ- వైసీపీకి గట్టి పోటీ ఇవ్వలేదనేది గురుమూర్తికి లభించిన మెజారిటీని బట్టి చూస్తే అర్థం చేసుకోవచ్చు.

నంద్యాలలో టీడీపీ అలా..
టీడీపీ నేతలు చేసిన ప్రచార హడావుడి.. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికను గుర్తుకు తీసుకొచ్చింది. 2017లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఉప ఎన్నికలో టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా చంద్రబాబు, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ మొదలుకుని పలువురు నాయకులు నంద్యాలలో మకాం వేసి మరీ.. ప్రచారం నిర్వహించారు. డబ్బు, మద్యం భారీగా ప్రవహించాయనే విమర్శలు అప్పట్లో చెలరేగాయి. నందమూరి బాలకృష్ణ డబ్బులు పంచుతూ కనిపించిన ఫొటోలు అప్పట్లో వైరల్గా మారాయి.

జగన్..చంద్రబాబు మధ్య తేడా..
ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్లా 2017లో అప్పటి సీఎం చంద్రబాబు నంద్యాల ఉప ఎన్నికలో విజయం సాధిస్తామనే ధీమాను ప్రదర్శించలేకపోయారు. తన పరిపాలనపై ప్రజలకు నమ్మకం లేదనే రీతిలో చంద్రబాబు అప్పట్లో నంద్యాలలో ప్రచార పర్వాన్ని సాగించారు. పలుమార్లు పర్యటించారు. నారా లోకేష్ అక్కడే మకాం వేసి మరీ ప్రచారం చేశారు. తాను వేసిన రోడ్ల మీద నడుస్తూ.. తాను ఇచ్చే పింఛన్ను తీసుకుంటూ తనకు కాకుండా మరెవరికి ఓటు వేస్తారంటూ ప్రజలను గద్దించిన వీడియోలు అప్పట్లో సంచలనం రేపాయి. ఆ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి 27 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.

పరిపాలన.. పథకాలపై విశ్వాసం..
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలికి పూర్తి భిన్నంగా వైఎస్ జగన్ ప్రవర్తించారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక బాధ్యతను స్థానిక నాయకుల మీదే వదిలేశారు. అసలు తిరుపతి ఉప ఎన్నిక ఒకటి ఉందనే విషయాన్ని దాదాపు మరిచిపోయినట్టుగానే కనిపించారు వైఎస్ జగన్. తిరుపతి లోక్సభ పరిధి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్నందున.. గెలుపు బాధ్యతను ఆ రెండుజిల్లాల నేతలకే అప్పగించారు. డబ్బు, మద్యాన్ని పంచలేదు. అయినప్పటికీ- 2.60 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో అభ్యర్థిని గెలిపించుకోగలిగారాయన. తనను చూసి కాకుండా..తన పరిపాలన, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేస్తారనే విశ్వాసంతో ఉన్నారు.

టీడీపీ ఓటుబ్యాంకు చెక్కు చెదరనట్టే..
ఓడిపోయినంత మాత్రాన టీడీపీ తక్కువ చేయడానికి వీల్లేదు. ఉప ఎన్నికలు పాలక పార్టీకే అనుకూలం అయినప్పటికీ కొన్ని సంకేతాలు ఇచ్చింది. అందులో మొదటిది- టీడీపీ ఓటింగ్ చెక్కు చెదరకపోవడం. జగన్ పరిపాలనను చూస్తూ కూడా..టీడీపీ ఓటర్లు.. వైసీపీ వైపు మళ్లలేదనేది ఈ ఎన్నికల్లో రుజువైంది. అలాగే- రెండేళ్ల తరువాత కూడా జగన్ సర్కార్పై ఎలాంటి వ్యతిరేక పవనాలు ఏర్పడలేదనే సంకేతాలను పంపించింది. వైసీపీ తన ఓటు బ్యాంకునూ నిలుపుకోగలిగింది. భారతీయ జనతాపార్టీ-జనసేన కూటమికి ఇప్పట్లో బలపడలేదని తిరుపతి ఉప ఎన్నిక మరోసారి నిరూపించింది. టీడీపీని కాదని.. ప్రత్యామ్నాయంగా ఎదగలేదనడానికి ఉదాహరణగా నిలిచింది.












Click it and Unblock the Notifications