టిడిపి, కాంగ్రెస్లలో ఢీ అంటే ఢీ: జగన్ సేఫ్ బట్ నో ఎంట్రీ!
హైదరాబాద్: విభజన అంశం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెసులలో చిచ్చు రాజేస్తోంది. ఇక మంత్రుల బృందం(జివోఎం)కు నివేదిక ఇవ్వమని చెబుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అఖిల పక్షం వేసినా అదే దారిలో నడవనుంది. తెలంగాణకు అనుకూలంగా ఉన్న బిజెపికి కూడా సెగ తగులుతోంది.
ఆ పార్టీ సీమాంధ్ర నాయకులు తమ ప్రాంతానికి న్యాయం చేసే వరకు విభజనకు మద్దతు ఇవ్వవద్దని కోరుతున్నారు. అయితే తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతున్నారు. విభజనపై టిడిపిలో అంతర్గతంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇరు ప్రాంతాల మధ్య విభేదాలు అడపాదడపా బయటకు కనిపిస్తోంది.

కాంగ్రెసు పార్టీలో అయితే తారాస్థాయికి చేరుకుంది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతల మధ్యనే కాకుండా సీమాంధ్రలోని కాంగ్రెసు పార్టీలో కూడా సవాళ్లు, ప్రతిసవాళ్లు వినిపిస్తున్నాయి. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇటీవల పార్టీలో ఉంటూ విమర్శలు చేయవద్దని, వెళ్లే వారు వెళ్లవచ్చని ఘాటుగానే చెప్పారు.
దీనిపై విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ వంటి వారు తీవ్రంగా స్పందించారు. కొందరు నేతలు పార్టీలో స్వేచ్ఛ ఉందని, అందుకే మాట్లాడుతున్నామని చెబుతుండగా, మరికొందరు బహిరంగంగా అధిష్టానాన్ని ధిక్కరించేలా మాట్లాడవద్దంటున్నారు. తద్వారా విభజనపై ముఖ్యమంత్రి వర్గం, ఆయన వ్యతిరేక వర్గం సీమాంధ్ర కాంగ్రెసులో కనిపిస్తోందంటున్నారు.
మరోవైపు జివోఎం, అఖిల పక్షంల పైన ఆయా పార్టీలు నివేదికలు తయారు చేసుకునే పనిలో పడ్డాయి. కొన్ని పార్టీలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాదం వైపు మొగ్గినా అఖిల పక్షం ఏర్పాటు చేస్తే వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉన్నాయంటున్నారు.
ఎందుకంటే గతంలో అఖిల పక్షంలో చెప్పిన నిర్ణయానికి వ్యతిరేకంగా చెబితే దానిని అందరూ ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అఖిల పక్షానికి వెళ్లక పోవడమే ఉత్తమమని ఆ పార్టీ భావించవచ్చునని అంటున్నారు. ఇక ఇరు ప్రాంతాల్లో బలంగా ఉన్న టిడిపికి అఖిల పక్షం పెద్ద చిక్కే అని చెప్పవచ్చు.
గతంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినా, ఇప్పుడు సమైక్య ఉద్యమం ఉన్న సమయంలో తాజా అఖిల పక్షంలో తెలంగాణకు వ్యతిరేకంగా చెప్పలేక, సమైక్యాంధ్రకు అనుకూలంగా చెప్పలేక ఇరుకున పడే అవకాశాలు ఉన్నాయని, అందుకే అది గైర్హాజరయ్యే అవకాశాలే ఉన్నాయంటున్నారు.
అధిష్టానంపై, జగన్పై శైలజానాథ్ ఫైర్
విభజనకు ఆర్టికల్ 3 అనే ఆయుధాన్ని ఇచ్చిందే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అని మంత్రి శైలజానాథ్ శుక్రవారం అన్నారు. టిడిపి, జగన్ పార్టీలు ఇప్పటికైనా సమైక్యమనాలన్నారు. జివోఎం ముందు తాము స్పందించేందుకు ఏమీ లేదన్నారు. విభజనకు సలహాలు ఇవ్వాలనే జివోఎంను కలిసినా ప్రయోజనం లేదన్నారు. విభజన ఆపుతామంటే మాట్లాడేందుకు సిద్ధమన్నారు.
జగన్కు తెలంగాణలో నో ఎంట్రీ!
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు గురువారం తెలంగాణ సెగ తగిలింది. మానుకోట పునరావృతం అయింది. అయితే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాటి పర్యటనకు పెద్దగా సెగ తగలలేదు. దీనిపై మంత్రి జానా రెడ్డి మాట్లాడుతూ.. జగన్ పార్టీ విభజనపై యూ టర్న్ తీసుకున్నందునే అడ్డుకున్నామని, చంద్రబాబు ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకుంటే అడ్డుకుంటామన్నారు. తద్వారా జగన్ పార్టీకి తెలంగాణలో నో ఎంట్రీ అని సంకేతాలిచ్చారు.












Click it and Unblock the Notifications