పురంధేశ్వరిపై డిగ్గీ భగ్గు, ఫ్యాన్స్ను పట్టించుకోని చిరు
విజయవాడ/శ్రీకాకుళం: కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వంటి వారు కాంగ్రెసు పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీ మారడం క్షమించరాని నేరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ శుక్రవారం అన్నారు. లౌకికవాదానికి కాంగ్రెసు పార్టీ మాత్రమే ప్రతీక అన్నారు.
దిగ్విజయ్ సింగ్ విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రలో భూముల విలువ పెరిగితే మంచిదే కదా అన్నారు. తెలంగాణ బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టిన సమయంలో టివి ఛానల్ ప్రసారాలు ఆగిపోవడం.. సాంకేతిక కారణాల వల్లనే అని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని మోడీపై డిగ్గీ విరుచుకుపడ్డారు. దేశంలో సెక్యులరిజం, సోషిలిజంకు ప్రతీకగా ఉన్న నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని ఏమీ చేయలేక ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు
మోడీ అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పురందేశ్వరికి మంత్రి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చామని, ఆమె పార్టీని వీడి క్షమించరాని పొరపాటు చేశారన్నారు. రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రకు కాంగ్రెస్ న్యాయమే చేశామన్నారు. విభజన వల్ల హైదరాబాద్లో రియల్ఎస్టేట్ పడిపోయిందని, సీమాంధ్రలో రియల్బూమ్ వచ్చిందని దిగ్విజయ్ అన్నారు.

ఫ్యాన్స్ను పట్టించుకోని చిరంజీవి
సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆకర్షణాస్త్రం కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవి.. ప్రచారంలో అభిమానులను, పార్టీ శ్రేణులను నిరాశపర్చుతున్నారంటున్నారు. చిరంజీవిని చూసేందుకు పలు ప్రాంతాల్లో అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా ఇఛ్ఛాపురంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర మంత్రి చిరంజీవి ఎక్కడ ప్రసంగం చేయలేదు.
అభిమానులు, కార్యకర్తలను అంతగా పట్టించుకోలేదు. శ్రీకాకుళంలో ప్రచారం చేస్తున్న చిరంజీవి... వాహనం పైకి కొద్దిసేపు మాత్రమే ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. ఆ తర్వాత పూర్తిగా బస్సులోనే ఉండిపోయారు. ఎక్కడా పెద్దగా ప్రసంగాలు చేయలేదు. చిరంజీవి బయటకు కనిపించక పోవడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు అప్ సెట్ అవుతున్నారు.












Click it and Unblock the Notifications