ఇక్కడేఉంటా: డిగ్గీ, కెవిపి చెప్తారు: టైటానియంపై ఆనంద్
హైదరాబాద్/విశాఖ/న్యూఢిల్లీ: ఎన్నికలు అయ్యే వరకు తాను తెలంగాణ ప్రాంతంలోనే ఉంటానని ఆంద్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ గురువారం అన్నారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం హైదరాబాదు కొచ్చిన దిగ్విజయ్.. తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని చెప్పారు. తాను అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని చెప్పారు.
కాంగ్రెస్ ప్రచారం మరింత జోరుగా సాగాలని కోరుకుంటున్నానని, అందుకే ఇక్కడికి వచ్చానన్నారు. తెలంగాణ ఇస్తామన్న హామీకి కట్టుబడే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుది సొంత అజెండా అన్నారు. రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను తాను పరిశీలిస్తున్నానని చెప్పారు. కెవిపి రామచంద్ర రావు పైన వచ్చిన ఆరోపణలను పరిశీలిస్తామన్నారు.
కెవిపి చెబుతారు: ఆనంద్ శర్మ
టైటానియం కుంభకోణంలో రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావును అరెస్టు చేసేందుకు అమెరికా దర్యాప్తు సంస్థ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన వ్యవహారంపై ఆయనే స్పందిస్తారని కేంద్రమంత్రి ఆనంద్ శర్మ అన్నారు. ఢిల్లీలో మాట్లాడిన ఆయన.. దోషి అని తేలితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
మోడీ హవా: వెంకయ్య
మే 1న తెలంగాణ ప్రాంతంలో నరేంద్ర మోడీ పర్యటిస్తారని బిజెపి నేత వెంకయ్య నాయుడు విశాఖలో అన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు అంతరించే దశకు చేరుకున్నాయన్నారు. మోడీ వచ్చాక బిజెపి హవా మరింత పుంజుకుంటుందన్నారు. ఎపిలోనే రాష్ట్రంలో విశాఖ అతిపెద్ద నగరమన్నారు.