'ప్లీజ్! అమరావతి రావొద్దు': తెలంగాణా-ఏపీనా?.. ఎంసెట్ లోకల్ టెన్షన్
అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులు చూసేందుకు ప్రజలు చాలామంది తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు నెలల్లో తాత్కాలిక సచివాలయ భవనాలను నిర్మించాల్సి ఉందని, పనులు వేగంగా సాగుతున్నందున ఇటువైపు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
పునాదులు, లోయర్ ఫ్లోర్లలో భాగంగా దాదాపు 100 అడుగుల వరకూ లోతుండే ఎన్నో పెద్ద పెద్ద గుంతలను తవ్వాల్సి ఉందని, దురదృష్టవశాత్తూ వాటిల్లో పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే పెద్ద పెద్ద ప్రొక్లెయినర్లు, భారీ యంత్ర పరికరాలు ఇక్కడికి చేరాయని, వాటి వద్దకు వెళ్లవద్దంటున్నారు. రైతులు కూడా వారి పశువులను మేత కోసం ఈ వైపు తోలవద్దని హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. ఇరుకుగా ఉన్న రహదారులపై ప్రయాణించే వారు సైతం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ఎంసెట్ పైన లోకల్ టెన్షన్
ఏపీలో ఏప్రిల్ 29వ తేదీన నిర్వహించే ఎంసెట్కు తమ పిల్లలు దరఖాస్తు చేసుకోవాలా, తెలంగాణలో ఇంటర్ వరకు చదువుతున్నందున మే 2న నిరవహించే తెలంగాణ ఎంసెట్కు దరఖాస్తు చేసుకోవాలో.. ఏపీ ఎన్జీవో ఉద్యోగులు తేల్చుకోలేకపోతున్నారు.
ప్రభుత్వం నిర్ణయం మేరకు రాజధానికి తరలి వెళ్తే తమ పిల్లల సంగతేమిటని ఏపీఎన్జీవోలు గందరగోళంలో పడుతున్నారు. హైదరాబాదులోని సచివాలయంతో పాటు పలు కార్యాలయాలు, ప్రభుత్వ అనుబంధ విభాగాల కార్యాలయాల్లో వేలాదిమంది ఉద్యోగులు పని చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరు జూన్ నాటికి నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే కార్యాలయాల్లోకి వెళ్లవలసి ఉంది. అయితే ఇక్కడికి వచ్చే ఉద్యోగుల పిల్లలను స్థానికులుగా పరిగణిస్తామని ప్రభుత్వం చెబుతోంది.
అయితే, ఇందుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకుంటే లేదా ఆలస్యమయితే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఇంటర్ వరకు హైదరాబాదులో చదివినప్పటికీ ఏపీ ఎంసెట్లో తమ పిల్లలు దరఖాస్తు చేసుకోవాలా, అవసరం లేదా, కేంద్రం నుంచి స్థానికత పైన భవిష్యత్తులో అనుమతి రాకుంటే తమ పిల్లలు ఏపీలోనే నాన్ లోకల్ అవుతారని ఆందోళన చెందుతున్నారు. మరో నాలుగు నెలల్లో ఉద్యోగులంతా ఏపీకీ రావాలని చెబుతున్న ప్రభుత్వం ఉద్యోగులకు చెబుతుండటం గమనార్హం. దీంతో ఉద్యోగులు గందరగోళంలో పడిపోయారు.












Click it and Unblock the Notifications