రెండేళ్లు చూశా, మోడీని కలవను: జగన్ ఎఫెక్ట్తో బాబు ముందు జాగ్రత్త
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై మాటల యుద్ధానికి తెరలేపారు. ప్రత్యేక హోదా విషయంలో ఆదివారం నాడు కేంద్రంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టిడిపి నేతలతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరు బీజేపీతో కటీఫ్ అనే విధంగా కనిపిస్తోంది. ఓ విధంగా ప్రధాని మోడీకి, కేంద్రానికి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. తాను ప్రధాని వద్దకు వెళ్లడం లేదని, తమ ఎంపీలు వెళ్లి పరిస్థితిని వివరిస్తారని చెప్పారు.
ప్రత్యేక హోదా పైన వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలతో బీజేపీ ఇప్పటీకే ఇరుకున పడింది. బీజేపీ ఇబ్బందులు తమ వరకు చేరకుండా చంద్రబాబు.. మోడీపై మాటల యుద్ధానికి తెరదీసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.

అందుకే ఈ రోజు ఘాటుగానే మాట్లాడారని అంటున్నారు. ఎల్లుండి (ఆగస్టు 2) జగన్ బందుకు పిలుపునివ్వడం, కాంగ్రెస్ హోదా కోసం రాజ్యసభలో బిల్లు పెట్టిన నేపథ్యంలో.. బీజేపీకి అంటిన మకిలి తమకు అంటకుండా, తాము ఇరుకున పడకుండా బాబు జాగ్రత్త పడుతున్నారంటున్నారు.
మిత్రధర్మం కోసం..
టిడిపి - బీజేపీ మిత్రపక్షాలు అని, మిత్రధర్ం కాబట్టి తమ ఎంపీలు వెళ్లి ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రధాని మోడీకి వివరిస్తారని చెప్పారు. తాను ఎక్కడా తప్పు చేయలేదని, చేయనని చెప్పారు. మిత్రధర్మం ప్రకారం ఈ రోజు అపాయింటుమెంట్ తీసుకొని వెళ్లి అడుగుతామన్నారు.
ఏపీ రెండేళ్ల పాప అన్నారు. రెండేళ్ల పాపను ఎలా చూసుకోవాలో ఏపీని అలాగే చూసుకోవాలన్నారు. సున్నితంగా చూసుకోవాలన్నారు. ప్రత్యేక హోదా పైన కేంద్రంతో పోరాడి విజయం సాధిస్తామని చెప్పారు. తమ పార్టీ ఎంపీలు ప్రధానితో అన్ని విషయాలు చర్చిస్తారన్నారు.
ఆదుకుంటారనే ఆగాను
తాను ఇన్నాళ్లు ఆగడానికి కారణం ఉందని చంద్రబాబు చెప్పారు. కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆదుకుంటుందని భావించానని చెప్పారు. సమయం వచ్చినప్పుడు తాము కచ్చితంగా దానిని బట్టి మసులుకుంటామన్నారు. రెండేళ్లపాటు ఎదురు చూశాని, ఆలోచించి ముందుకెళ్తామని చెప్పారు. హోదాపై బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు.
జగన్కు పరోక్షంగా, ప్రత్యేక్షంగా ముఖ్యమంత్రి చురకలు అంటించారు. కేంద్రంపై తాము రాజీలేని పోరాటం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. హోదా కోసం అన్ని రాజకీయ పార్టీలు కలవాలన్నారు. దగాపడ్డ ఏపీకి రావాల్సిన హోదా అంశాన్ని రాజకీయ పార్టీలు స్వలాభం కోసం ఉపయోగించుకోవద్దని హితవు పలికారు.
ఎవరు మాట తప్పినా ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ సత్తా చూపిస్తారని బీజేపీకి, వైసిపికి, కాంగ్రెస్ పార్టీలకు చురకలంటించారు. కేంద్రంపై విజయం సాధిస్తామన్నారు. దగాపడ్డ ఏపీకి న్యాయం చేయమని తాను అడుగుతున్నానని, అందరు సహకరించాలన్నారు. విభజన చేశాక కేంద్రం బాధ్యత ఉంటుందని చెప్పారు. మేం ట్యాక్స్లు అన్నీ చెల్లిస్తున్నప్పుడు, ఎందుకు న్యాయం జరగాలని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications