కొత్త కరెంటు ఛార్జీలతో జగన్ సర్కార్ కు డబుల్ బొనాంజా-డిస్కంలకు లాభం-సంక్షేమానికి కత్తెరతో
ఏపీలో విద్యుత్ ఛార్జీల్లో సవరణలు చేస్తూ తాజాగా ఏపీఈఆర్సీ నిర్ణయం ప్రకటించింది. ఇందులో గతంలో ఉన్న విధానాన్ని మార్చి ఆరు స్లాబ్ లుగా విభజించింది. దీంతో కొత్త స్లాబ్ ల ప్రకారం ఆగస్టు నుంచి ఛార్జీలు వర్తింపచేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ కొత్త స్లాబ్ ల విధానం వెనుక ఉన్న మతలబు ఓసారి గమనిస్తే ప్రభుత్వానికి ఇది రెండు విధాలుగా ప్రయోజనం కల్పించబోతోందన్నది అర్ధమవుతోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో కోతలకూ ఇది కారణం కాబోతోంది.
విద్యుత్ ఛార్జీల పెంపు
ఏపీలో విద్యుత్ ఛార్జిలు పెంచుతూ తాజాగా విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో విపక్షాలన్నీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టీ పెరిగిన ఛార్జీలపైనే కనిపిస్తోంది. అందులోనూ విద్యుత్ తక్కువ వినియోగించే వారిపై ఎక్కువ బాదుడు వేసి ఎక్కువ వినియోగించే వారికి తక్కువగా పెంచడం కూడా విమర్శలకు తావిస్తోంది. అలాగే పాత విధానాన్ని మార్చి ఆరు స్లాబ్ ల కొత్త విధానం తీసుకురావడం వెనుక ఉన్న మతలబుపైనా చర్చ జరుగుతోంది.
స్లాబ్ ల మార్పుతో డబుల్ షాక్
గతంలో ఉన్న విధానాన్ని సవరించి ఆరు స్లాబ్ ల విధానం తీసుకొచ్చింది ఈఆర్సీ. దీని ప్రకారం గతంలో ఓ స్లాబ్ లో ఉన్న వారు మరో స్లాబ్ లోకి మారారు. ఈ మార్పుల కారణంగా ప్రభుత్వానికి డబుల్ ప్రయోజనం చేకూరనుండగా..ప్రజలకు మాత్రం డబుల్ షాక్ తప్పేలా లేదు. ప్రభుత్వానికి నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఊరట రూపంలో ప్రయోజనంతో పాటు సంక్షేమ పథకాలకు వర్తింపచేస్తున్న 300 యూనిట్ల పరిమితి కూడా ఊరట కల్పించబోతోంది. దీంతో జనానికి ఆగస్టు నుంచి చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
డిస్కంలకు రూ.1400 కోట్ల ఊరట
ఇప్పటికే రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సంస్ధలు నష్టాల్లో ఉన్నాయి. ఉచిత విద్యుత్ తో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల కారణంగా విద్యుత్ సంస్ధలు రోజురోజుకీ నష్టాల్లో కూరుకుపోతున్నాయి. తిరిగి వాటిని బతికించే పేరుతో ప్రభుత్వం ప్రజలపై కరెంటు ఛార్జీల భారం మోపుతోంది. దానికి బదులు విద్యుత్ ను సెకీ వంటి సంస్ధల నుంచి కాకుండా తక్కువ రేటుకు కొనుగోలు చేస్తే సరిపోతుంది. కానీ ప్రభుత్వం అలా చేసేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పుడు ఈఆర్సీ ప్రకటించిన విద్యుత్ ఛార్జీలు ఆగస్టు నుంచి అమల్లోకి వస్తే డిస్కంలకు రూ.1400 కోట్ల ప్రయోజనం చేకూరబోతోంది.
సంక్షేమానికి కత్తెర ఖాయం ?
ప్రస్తుతం వైసీపీ సర్కార్ రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలకు నెలకు 300 యూనిట్ల వినియోగాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మార్చిన స్లాబుల విధానం ప్రకారం 300 యూనిట్లు దాటిన వారికి ఓవైపు అదనపు చార్జీల మోతతో పాటు వారికి సంక్షేమ పథకాల్లోనూ కోత పడబోతోంది. తద్వారా ప్రభుత్వంపై సంక్షేమ భారం కూడా తగ్గబోతోంది. ఎక్కువ యూనిట్లు విద్యుత్ వాడారన్న కారణంతో వారిని పేదల జాబితాలో నుంచి తొలగించి సంక్షేమ పథకాలకు వారిని దూరం చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరి దీనిపై ప్రభుత్వం ఏం క్లారిటీ ఇస్తుందో చూడాలి.