దుర్గ గుడిలో పూజలు: సీఎంకు రెండు నివేదికలు
అమరావతి: బెజవాడ దుర్గుగుడిలో జరిగిన పూజల వ్యవహారంపై దేవాదాయశాఖ, పోలీసు శాఖ వేరువేరుగా నివేదికలు సమర్పించాయి. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ముందుగా నగర పోలీసు కమీషనర్ గౌతం సవాంగ్ చేరుకొని ముఖ్యమంత్రి చంద్రబాబుకు పోలీసుశాఖ చేసిన విచారణ నివేదికను సమర్పించారు.
ఆ తర్వాత, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, ఆ శాఖ కమిషనర్ అనురాధ కూడా శాఖాపరంగా తాము నిర్వహించిన విచారణ నివేదికను సీఎంకు అందజేశారు. దీనిపై సీఎం వేరువేరుగా రెండు శాఖలతో సమావేశమై వాస్తవ పరిస్థితిని అంచనా వేసి తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. రెండు రోజుల్లో మొత్తం 40మందిని దేవాదాయశాఖ చేసిన విచారణ అధికారి రఘునాధ్ ప్రశ్నించి విచారణ నివేదికను రూపొందించారు.
ఆలయ ప్రధాన అర్చకుడు బద్రినాధ్ సహా పూజలో పాల్గొన్న బయట వ్యక్తిని కూడా పోలీసులు, దేవాదాయశాఖ కూలంకుశంగా ప్రశ్నించింది. దుర్గ గుడిలో అర్ధరాత్రి పూజల వ్యవహారంపై నిజనిర్ధారణ కమిటీ నివేదిక తొలుత దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయానికి చేరింది.
ఆలయంలో సంప్రదాయ విరుద్ధంగా పూజలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన నిజ నిర్ధరణ సంఘం అన్ని కోణాల్లోనూ విచారించి సంబంధిత శాఖ కమిషనర్కు సమర్పించగా.. దాన్ని ఈ సాయంత్రం దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు కార్యాలయంలో సమర్పించారు. దీన్ని మంత్రి పరిశీలించాక ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాణిక్యాలరావు అందజేశారు.
ఈ నిజనిర్థారణ సంఘంలో సభ్యులైన దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రఘునాథ్, ఆగమశాస్త్ర పండితుడు చిర్రావుల శ్రీరామశర్మ శుక్రవారం దుర్గగుడికి వచ్చి 40మందిని విచారించారు. వీరిలో కొందరి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆలయ సంప్రదాయాలకు భిన్నంగా ఏమైనా జరిగిందా? అనే అంశంపైనా విచారించారు. అలాగే ఆలయంలో రికార్డయిన సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. వీటన్నింటినీ విశ్లేషించి రూపొందించిన నివేదికను ఈ రోజు కమిషనర్కు అందజేశారు.