ఏపీలో రైతులకు కీలక అలెర్ట్..పంటల బీమా పొందాలంటే ఈ పని తప్పనిసరి!
ఆంధ్రప్రదేశ్లో ఎల్ నినో ప్రభావంతో రైతన్నలు సాగు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పంటల బీమా కవరేజ్ గణనీయంగా పెరిగింది. గతేడాది 19 లక్షల ఎకరాలకు బీమా చేయగా, ఈసారి 40.63 లక్షల ఎకరాలకు పంటల బీమా చేశారు. రైతులు తమ వాటాగా రూ.265.50 కోట్లు ప్రీమియం చెల్లించారు.
పంటల బీమా పథకం పొందాలంటే
వర్షాభావ పరిస్థితులతో సాగుపై ఆందోళనలో ఉన్న రైతులు పంటల బీమా చేశారు. అయినప్పటికీ పంటల బీమా ప్రయోజనం పొందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-పంట వ్యవస్థలో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. లేనిపక్షంలో ప్రీమియం చెల్లించినా పాలసీకి ఆమోదం లభించదు. ఈ-పంటలో నమోదైన పంట, బీమా చేసిన పంట ఒకటే ఉండాలి. తేడా ఉంటే బీమా సంస్థలు తిరస్కరించే అవకాశం ఉంది. నమోదు సమయంలో రైతులు జాగ్రత్తగా వివరాలు సరిచూసుకోవాలి.

ఈ-పంట నమోదుపైనే ఆధారపడి అన్ని ప్రయోజనాలు
ఈ-కేవైసీ కూడా తప్పనిసరి.చెక్ చేసుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 38 లక్షల మంది రైతుల వివరాలు ఈ-పంటలో నమోదయ్యాయి. అయితే వారిలో కేవలం 1,10,550 మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేశారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు ఈ-పంట నమోదుపైనే ఆధారపడి ఉన్నాయి.
ఈ-పంటలో పేరు తప్పనిసరి
పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయాలంటే, కరవు, వర్షాలు లేదా వరదలతో పంటలు దెబ్బతిన్నప్పుడు పెట్టుబడి సాయం పొందాలంటే, వ్యవసాయ రుణాలు లేదా రాయితీ పథకాల లబ్ధి కావాలంటే ఈ-పంటలో పేరు ఉండాల్సిందే. రైతులు మూడు మార్గాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఏపీఏఐఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్, ఆధార్తో లాగిన్ అయి సొంతంగా సర్వే నంబర్, పంట వివరాలు నమోదు చేయవచ్చు.
ఈ పంటలో నమోదుకు ఇలా చెయ్యొచ్చు
ఈ-కేవైసీ కూడా ఇందులోనే పూర్తి చేయవచ్చు. ఇప్పటి వరకు 5,744 మంది రైతులు 10,226 పొలాలను ఈ విధంగా నమోదు చేసుకున్నారు. అలా కాకుంటే రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ, ఉద్యాన సిబ్బంది సహాయంతో నమోదు చేసుకోవచ్చు. అంతేకాదు వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన ప్రైవేటు సర్వేయర్ల సేవలు తీసుకోవడం ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చు.
వ్యవసాయ పొలాలు ఫార్మర్ ఐడీతో అనుసంధానం తప్పనిసరి
పంటల బీమాలో నమోదైన రైతులు తప్పనిసరిగా ఈ-పంట, ఈ-కేవైసీ పూర్తి చేయాలని వ్యవసాయ శాఖాధికారులు చెప్తున్నారు. కేంద్రం వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు రైతు విశిష్ఠ గుర్తింపు సంఖ్యను తప్పనిసరి చేసిందని, కాబట్టి ప్రతి రైతు తమ వ్యవసాయ పొలాలను ఫార్మర్ ఐడీతో అనుసంధానించుకోవాలని చెప్తున్నారు. సకాలంలో నమోదు చేసుకోవడం ద్వారా రైతులు బీమా, సబ్సిడీ, కొనుగోలు వంటి అన్ని ప్రయోజనాలను సులభంగా పొందవచ్చు.














Click it and Unblock the Notifications