న్యాయమేనా? నువ్వు చేయాల్సిన పనేనా రైల్వే?
వలస కూలీలు, దిగువ మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు, పేదలు ప్రయాణించే జనరల్ బోగీలు, స్లీపర్ క్లాస్ బోగీలంటే రైల్వేశాఖకు లెక్కే లేదు. అన్ని రైళ్లల్లో స్లీపర్ బోగీలు తగ్గించి ఏసీ బోగీలు పెంచాలనే లక్ష్యాన్ని రైల్వే నిర్ధేశించుకుంది. ఏదో ఉంచామంటే ఉంచాం అనే రీతిలో మొక్కుబడిగా ఒకటి లేదంటే రెండు బోగీలనే రైలుకు ఉంచుతోంది. దీనివల్ల దూర ప్రాంతాలకు ప్రయాణించేవారు ఎంతో కష్టనష్టాలకు గురవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లను పరిశీలిస్తే ఈ విషయం వెల్లడవుతుంది. పై నుంచి వచ్చిన ఆదేశాలను అమలు చేయడమే కానీ తమదగ్గర ఏమీలేదని ఇక్కడి అధికారులు చెబుతున్నారు.
అన్ని మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలోని జనరల్ బోగీల్లో ప్రయాణం చేయాలంటే ప్రజలకు ప్రత్యక నరకంలా మారింది. రిజర్వేషన్ లేకుండా సాధారణ టిక్కెట్ తీసుకొని ప్రయాణించాలనుకునే వారంతా ఈ రెండు బోగీల్లోనే సర్దుకోవాల్సి ఉంటుంది. రద్దీని తట్టుకోలేక బాత్ రూమ్ లో కూడా నిలబడి ప్రయాణిస్తున్నారు.
రైళ్లల్లో గతంలో ఉన్న స్లీపర్ బోగీలను తగ్గించి వాటిస్థానంలో ఏసీ బోగీలను క్రమంగా పెంచుతున్నారు. దీనివల్ల స్లీపర్ లో బెర్త్ దొరకడం గగనంగా మారింది. చివరకు ఇవి కూడా ప్రయాణికుల రద్దీతో జనరల్ బోగీల్లా మారాయి.

అధిక మొత్తం వెచ్చించలేక : ఏసీ బోగీ బుక్ చేసుకోవాలంటే అధిక మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య ప్రయాణించే గోదావరి ఎక్స్ ప్రెస్ లో థర్డ్ ఏసీ రూ.1090, సెకండ్ ఏసీ రూ.1535, ఫస్ట్ ఏసీ రూ.2565గా ఉంది. స్లీపర్ అయితే రూ.415. భువనేశ్వర్-బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రశాంతి ఎక్స్ ప్రెస్, హౌరా-చెన్నై మెయిల్, ధనబాద్-అలప్పూజ, గోదావరి ఎక్స్ ప్రెస్, విశాఖ-తిరుపతి తిరుమల ఎక్స్ ప్రెస్, షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్, భువనేశ్వర్-సికింద్రాబాద్ విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లల్లో ఒక్కో రైలులో 5 బోగీల చొప్పున స్లీపర్ ను తొలగించుకుంటూ వచ్చి వాటి స్థానంలో థర్డ్ ఏసీ బోగీలను పెంచుకుంటూ వచ్చారు.












Click it and Unblock the Notifications