AP Lok Sabha Election Results 2024: ఏపీ ఎంపీ సీట్లలో కూటమికి భారీ లీడ్-ఎక్కడెక్కడంటే ?
ఏపీలో ఇవాళ ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా ఎంపీ సీట్లలో కూటమి ఆరంభంలోనే ఆధిక్యాలు అందుకుంటోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు అనకాపల్లి, అమలాపురం, విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం సీట్లలో కూటమి అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. వీరి ఆధిక్యాలు రౌండ్ రౌండ్ కూ పెరుగుతుంటడం విశేషం.

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని) 5432 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుంటూరు లోక్ సభ స్ధానంలో టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధిక్యంలో ఉన్నారు. అలాగే శ్రీకాకుళం లోక్ సభ స్ధానంలో టీడీపీ అభ్యర్ధి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా లీడ్ లో ఉన్నారు. అటు అనకాపల్లి ఎంపీ సీటులో బీజేపీ అభ్యర్ధి సీఎం రమేశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే అమలాపురం ఎంపీ సీటులో టీడీపీ అభ్యర్ధి గంటి హరీష్ మాథుర్ ఆధిక్యంలో ఉన్నారు.
కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఓట్ల బదిలీ సవ్యంగా సాగినట్లు తాజా ఆధిక్యాలు స్పష్టం చేస్తున్నాయి. కూటమిలో పార్టీల మధ్య ఓట్ల బదిలీ జరిగితే ఆ ప్రభావం కచ్చితంగా ఫలితాలపై ఏకపక్షంగా ఉంటుందనే అంచనాలు ఇవాళ నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కూటమి ప్రభావం ఎక్కువగా ఉందని తాజా ఫలితాల ట్రెండ్ సూచిస్తోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే ఎంపీ సీట్లలో జాతీయ మీడియా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి.












Click it and Unblock the Notifications