ఈడీ విచారణలో సాయిరెడ్డి-ప్రశ్నల వర్షం-రేపు మిథున్ రెడ్డి..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని భావిస్తున్న మద్యం స్కాం కేసులో ఏపీ సీఐడీ సిట్ చేస్తున్న దర్యాప్తు ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో మద్యం స్కాం డబ్బు మనీలాండరింగ్ జరిగిందనే అనుమానాలతో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఇవాళ విచారణకు పిలిపించింది. దీంతో హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన సాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
మద్యం స్కాం ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు తరలించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా అప్పట్లో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డితో పాటు ఇప్పటికీ కీలకంగా ఉన్న సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డిని కూడా విచారణకు పిలిపిస్తూ సమన్లు ఇచ్చింది. వీటికి స్పందిస్తూ విజయసాయిరెడ్డి ఇవాళ హైదరాబాద్ కార్యాలయంలో విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా ఈడీ మద్యం స్కాంపై పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా మద్యం అమ్మకాలను డిజిటల్ పేమెంట్స్ ద్వారా కాకుండా నగదు రూపంలో ఎందుకు వసూలు చేశారనే అంశంపై విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అలాగే మద్యం స్కాం ద్వారా వచ్చిన డబ్బు ఎవరెవరికి వెళ్లింది, మనీలాండరింగ్ లో ఎవరెవరు భాగస్వాములుగా ఉన్నారో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మద్యం పాలసీ రూపకల్పన తన సమక్షంలో జరిగినా, ఆ తర్వాత వసూళ్లలో తన పాత్ర లేదని సాయిరెడ్డి చెప్పినట్లు సమాచారం.

మద్యం స్కాం కేసులో సాయిరెడ్డితో పాటు మరో నిందితుడిగా ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఈడీ విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన రేపు ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే సిట్ విచారణకు హాజరు కావడంతో పాటు జైల్లో కూడా ఉన్న మిథున్ రెడ్డి ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. ఈడీ విచారణ తర్వాత మిథున్ రెడ్డి, సాయిరెడ్డిల అరెస్టుల విషయంలో ఈడీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది.












Click it and Unblock the Notifications