ఏ క్షణంలో అయినా ఎన్నికలు : 150 సీట్లు పక్కా - ఎలాగంటే : అచ్చెన్న సంచలనం..!!
టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి 150 సీట్లకు పైగా వస్తాయని జోస్యం చెప్పారు. హనుమాన్ జంక్షన్ లో జరిగిన రైతు వర్క్ షాపులో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు. రెండేళ్లు ఉందని నిద్రపోవద్దు.. ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రైతులను సీఎం జగన్ సర్కార్ అడుగడుగునా ముంచిందని విమర్శించారు. ఉద్యోగుల నుంచి పేదల దాకా ప్రతి ఒక్క రంగాన్ని ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు.
ఏ క్షణంలో అయినా ఎన్నికలు
కలలో లేచి రాష్ట్ర శాసనసభను రద్దు చేస్తున్నట్లు లెటర్ ఇచ్చినా.. ఆశ్చర్య పోనవసరం లేదంటూ ఎద్దేవా చేసారు. వైఎస్ వివేకా హత్య కేసును టీడీపీకి అంటగట్టాలని చూశారన్నారు. వివేకానందరెడ్డి హత్య ద్వారా వచ్చిన సింపతితోనే జగన్ సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. కోడికత్తి డ్రామా సింపతికిపని చేయలేదనే వివేకా హత్యకు తెర తీశారని విమర్శించారు. హత్య కేసులో నిందితులను ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నించారు. రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని టీడీపీ నేతలపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. డీజీపీగా పని చేసిన సవాంగ్ కు అన్నా అంటూ సీఎం జగన్ సున్నం పెట్టాడని చెప్పుకొచ్చారు.
ఉద్యోగుల కారణంగానే ఓడిపోయాం
ఉద్యోగుల కారణంగానే 2019 ఎన్నికల్లో ఓడిపోయామంటూ కీలక అంశాన్ని వెల్లడించారు. ఉద్యోగులు భయపడో.. ఏదో ప్రలోభాలకు గురయ్యో ఉద్యోగులు లొంగిపోయారని చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పార్టీ నేతలతో ఎన్నికలు ముందుగానే వస్తాయని అంటున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు సైతం ఏ క్షణంలో అయినా ఎన్నికలు రావచ్చని చెప్పటం ద్వారా కేడర్ ను సిద్దం చేసే పని ప్రారంభించారు. అదే సమయంలో చంద్రబాబు సైతం ఇప్పటికే గతం కంటే భిన్నంగా ముందుగానే అభ్యర్దుల ఖరారు పైన నిర్ణయానికి వస్తున్నారు. ముందుగా కడప జిల్లాలో అభ్యర్ధుల ఖరారు ప్రక్రియ ప్రారంభించారు.
వివేకా హత్య - సీఎం లక్ష్యంగా
వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం పైన విమర్శలు చేస్తూ..ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాన్ని టీడీపీ అమలు చేస్తోంది. అదే సమయంలో పీఆర్సీ వ్యవహారంలో ఇప్పటికీ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వం పైన ఆగ్రహంతో ఉన్నాయి. తాము దాదాపు 60 సీట్ల మేర గెలుపు ఓటమలును ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నామంటూ అల్టిమేట్ జారీ చేస్తున్నాయి. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని టీడీపీ భావిస్తోంది. మే లో జరిగే మహానాడు ద్వారా 2024 ఎన్నికలకు సమాయత్తం ప్రారంభించే వ్యూహంలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది.