ప్రముఖ ఆలయాల్లో దర్శనం, గదుల బుకింగ్ ఇక నుంచి సులభంగా ఇలా..!!
భక్తులకు మెరుగైన సేవలకు దేవాదాయ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రముఖ ఆలయాల్లో భక్తులకు సులభమైన సేవలను అందించేందుకు కొత్త విధానం అమల్లోకి తెస్తున్నారు. అందులో భాగంగా డిజిటల్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా ఇక నుంచి అన్ని ముఖ్య ఆలయాల్లో దర్శనంతో పాటుగా ఆర్జిత సేవా టికెట్లు.. గదుల బుకింగ్ అన్నీ సులభం గా పొందేందుకు వీలుగా కొత్త విధానం అమలు చేస్తున్నారు. దీని ద్వారా భక్తులకు ప్రయోజన కరంగా మారనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆలయాల్లో భక్తులకు మరింత సులభమైన సేవలను అందించేలా ప్రభుత్వం ఇప్పటికే ఆన్ లైన్ సేవలను ప్రారంభించింది. అందులో భాగంగా భక్తులకు దర్శనం, ఆర్జిత సేవలు, వసతి గదులను సులభంగా బుకింగ్ చేసుకోవడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్ను ప్రవేశపెట్టింది. ఏపీ టెంపుల్స్ మొబైల్ యాప్ ద్వారా దర్శనం, ఆర్జిత సేవా టికెట్, వసతి గదులను బుకింగ్ చేసుకుని శ్రీశైలం యాత్రకు రావొచ్చని ఆలయ ఈవో వెల్లడించారు. మరోవైపు కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో సేవ, ఆర్జిత సేవ, దర్శనం, వసతి, ప్రసాదం టికెట్లు ఎక్కడి నుంచైనా పొందే సౌలభ్యం తీసుకొచ్చారు. అధికారులు నూతన వెబ్సైట్, వాట్సప్ను రూపొందించారు.

కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులు ముందస్తుగానే బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
https://www.srikanipakadeasthanam.com,https://www.aptemples.ap.gov.in లేదా వాట్సప్ 95523 00009లో ఈ సేవలు పొందవచ్చు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇకపై అన్ని సేవలు ఆన్లైన్లో సులభతరంగా అందుబాటులోకి రానున్నాయి. కాగా, ఇప్పటికే భక్తులే నేరుగా స్వయంగా టికెట్లు పొందేలా వివిధ ఆలయాల్లో 100 కియోస్క్ల ఏర్పాటుకు అనుమతిచ్చారు. అలాగే దర్శనాలు, సేవలు, పార్కింగ్ టికెట్ల జారీకి ఈ పోస్ యంత్రాలు వినియోగించేలా రాష్ట్ర దేవాదయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వం మనమిత్ర యాప్తో అనేక సేవలు అందిస్తుండగా, అందులో వివిధ ఆలయాల దర్శనాలు, సేవలు, వసతుల బుకింగ్ వంటి సదుపాయం కూడా ఉంది. దీనిపై మరింతలా భక్తులకు అవగాహన కల్పించేలా అన్ని ప్రధాన, ముఖ్య ఆలయాల్లో ప్రత్యేక వాట్సప్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు.












Click it and Unblock the Notifications