వరద బాధితులకు ప్రభుత్వం కీలక సూచన - నష్టం వివరాలివ్వండి..!!
విజయవాడలో వరదలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. క్రమేణా వరద ముంపు నుంచి నగరం బయట పడుతోంది. ఇదే సమయంలో భారీ వర్షాలతో ప్రభుత్వం మరోసారి అప్రమత్తం అయింది. ఈ సమయంలోనే వరద ల కారణంగా జరిగిన నష్టం అంచనా మొదలైంది. నగరంలో నష్టం అంచనా పైన ప్రతీ ఇంటికి అధికారులు వెళ్లనున్నారు. దీని కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించారు. ఇదే సమయంలో ప్రభుత్వం వదర బాధితులకు కీలక సూచనలు చేసింది.
నష్టం అంచనా
విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని 2.32 లక్షల నివాసాల్లో నష్టం సర్వే నేటి నుంచి ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ జిల్లాలోని 2.32 లక్షల గృహాలతోపాటు వాణిజ్య, వ్యాపార సంస్థలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నారు. దీనికిగాను రెవెన్యూ, సచివాలయ సిబ్బందితో 17 వేల బృందాలను ఏర్పాటు చేశారు. నష్టం అంచనా నమోదుకు ప్రత్యేక యాప్ను రూపొందించారు. ఈ బృందాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(రెవెన్యూ) ఆర్పీ సిసోడియా నేతృత్వంలో ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శిక్షణ ఇచ్చారు.

ప్రత్యేక టీంలు
నష్టం అంచనా కోసం ఒక్కో బృందానికీ డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహిస్తారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన తెలిపారు. వారితోపాటు వార్డు సెక్రటరీ, వలంటీర్, పోలీసు సిబ్బంది ఒకరు ఉంటారన్నారు. మూడు రోజుల్లో నష్టాన్ని నమోదు చేస్తామన్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి వార్డుకు ఒక ఐఏఎస్ అధికారితోపాటు జిల్లా అధికారి ఒకరు పనిచేస్తారని వెల్లడించారు. ఇక,
ఎన్యూమరేషన్ బృందాలు వచ్చిన సమయంలో గృహ, వ్యాపార సంస్థల యజమానులు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సృజన కోరారు.
ప్రతీ ఇంటికీ
ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వస్తే ఎన్యూమరేషన్కు ఇబ్బంది లేకుండా ఉంటుందని సూచించారు. ఏదైనా కారణం వల్ల ఇంట్లో ఎవరూ లేకుంటే వార్డు సెక్రటరీకి సమాచారం ఇస్తే మరోసారి ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్ చేస్తారని వివరించారు. తొలుత గృహాల్లో నష్టం అంచనాకు ప్రాధాన్యం ఇస్తారని కలెక్టర్ చెప్పారు. ఆ తర్వాత ఆటోలు, రిక్షాలు, తోపుడు బండ్లు తదితరాలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. కాగా, విద్యార్థులతో కూడిన మరికొన్ని బృందాలు సమాంతర సర్వే నిర్వహించనున్నాయి.












Click it and Unblock the Notifications