టీటీడీ ఆలయాలకు ఇక మహర్దశ- ఒక్కో గుడి కోసం ప్రత్యేకంగా.. !!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం నాడు 79,098 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 24,083 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.16 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 20 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది నుంచి 10 గంటల సమయం పట్టింది.
కాగా- టీటీడీ స్థానిక, అనుబంధ ఆలయాలకు మహర్దశ పట్టనుంది. వాటి నిర్వహణ బడ్జెట్, స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొటొకాల్, అభివృద్ధికి టీటీడీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. దీనిపై కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష నిర్వహించారు. టీటీడీ అనుబంధ, స్థానిక ఆలయాల వార్షిక హుండీ ఆదాయం, ఖర్చులు ఎంత, ఏఏ ఆలయాలకు బడ్జెట్ కు లోబడి ఖర్చులు అవుతున్నాయి, ఏఏ ఆలయాలలో ఆదాయానికి మించి ఖర్చులు అవుతున్నాయనే అంశాలపై అధికారులతో చర్చించారు.

అనంతరం ఆయన మాట్లాడారు. ఇకపై ప్రతి ఆలయ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓ కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేయాలని అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. ఆలయాల రోజువారి నిర్వహణ, మరమ్మతులు తదితర సాధారణ ఖర్చులను కార్పస్ ఫండ్ కు వచ్చే వడ్డీ సొమ్ముతో ఖర్చు చేయాలని సూచించారు. పెద్ద స్థాయిలో మరమ్మతులు, వార్షిక ఉత్సవాల కోసం కేపిటల్ ఖర్చుగా భావించి టీటీడీ నిధులతో వాటిని నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి ఆలయానికి బ్యాంక్ జనరల్ అకౌంట్, అన్నదానం కోసం మరో ఖాతా తెరిపించేలా చర్యలు తీసుకోవాలని సింఘాల్ సూచించారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, సీసీటీవీలు, సెక్యూరిటీ, రవాణా, ట్రాఫిక్ తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. వచ్చే వేసవి నేపథ్యంలో టీటీడీ ఆలయాలలో భక్తులకు వైద్యసేవలు, మంచినీరు, వ్యర్థాల నిర్వాహణ, మరుగుదొడ్లు తదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
టీటీడీలోని ఆలయాలలో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించేందుకు, కార్యక్రమాల నిర్వహణపై స్టాండర్డ్ ప్రొటోకాల్ ఆపరేటివ్ రూపొందించాలని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఆలయానికి విరాళాలు ఇచ్చేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు.












Click it and Unblock the Notifications