కేసీఆర్ని బాబు అందుకే తప్పించారు: ఎర్రబెల్లి రివర్స్, మోత్కుపల్లి ఫైర్
హైదరాబాద్: అవినీతి వల్లనే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు మంత్రివర్గం నుండి తప్పించారని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు మంగళవారం అన్నారు. కేసీఆర్ అప్పట్లో చేసిన తప్పును ఏఫీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా బహిర్గతం చేశారని చెప్పారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్యను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయడాన్ని ఎర్రబెల్లి ఖండించారు. రాజయ్య చేసిన అవినీతిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కేబినెట్లో ముగ్గురు తప్ప అందరు తెలంగాణ ద్రోహులే అన్నారు. తెలంగాణ మొదటి సీఎం దళితుడేనని చెప్పిన కేసీఆర్, ఆ పదవి చేపట్టి, దళితులను మోసం చేశారన్నారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు.
రాజయ్యను తొలగించి మాదిగలను కించపరిచారన్నారు. రాజయ్య అవినీతితో పాటు కేసీఆర్, కేటీఆర్ కుటుంబ సభ్యుల అవినీతి పైన ఏశీబీ లేదా సీబీసీఐడీతో విచారణ జరిపించాలన్నారు. మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కలిపించకపోవడం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహిళలను అవమానించడం కాదా అన్నారు. కడియం శ్రీహరి సామాజిక వర్గం బైండ్ల అని, తెలంగాణలో వారి సంఖ్య వెయ్యిలోపే అన్నారు.
ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారికే పదవులు కట్టబెడుతున్నారన్నారు. సీఎం పేషీ ఆదేశాల మేరకే పనిచేశానని రాజయ్య చెబుతున్నారని విమర్శించారు. అన్ని శాఖల్లో సీఎం ఆదేశాల మేరకే అవినీతి జరుగుతోందని, అవినీతిపై వెంటనే విచారణ జరపాలన్నారు. గతంలో చంద్రబాబు మంత్రి వర్గంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కున్న కేసీఆర్ను చంద్రబాబు ముందుగా చెప్పి మంత్రివర్గం నుంచి తప్పించారని, కానీ ఇప్పుడు ఎలాంటి సమాచారం లేకుండానే రాజయ్యను తొలగించారన్నారు.
అందుకే రాజయ్యను తప్పించారు: మోత్కుపల్లి
కేసీఆర్కు తెలియకుండా హెల్త్ యూనివర్సిటీ పైన ప్రకటన చేసినందుకే రాజయ్య పైన వేటు వేశారని మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా రాజయ్య మంచితీరు కనబరిచారన్నారు. తన చేతిలో ఉన్న శాఖలకు ఎంత వరకు న్యాయం చేశారో కేసీఆర్ చెప్పాలని సవాల్ చేశారు. కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. తెలంగాణ కోసం బలిదానాలు చేసుకున్న వారు దళితులు కాదా అని ప్రశ్నించారు.