భారీ పేలుడు: కిషన్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో శనివారం రాత్రి సిలిండర్ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ సిలిండర్ పేలుడు ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఏడెనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
హైదరాబాద్ నింబోలి అడ్డాలోని గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో శనివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. నింబోలి అడ్డాలోని సంజయ్గాంధీ నగర్లో బిజ్జుసింగ్ అనే వ్యక్తి రెండు ఇళ్లను అద్దెకు తీసుకుని అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రాన్ని నడుపుతున్నాడు. రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఖాళీ సిలిండర్లోకి గ్యాస్ ఎక్కిస్తుండగా పేలుడు సంభవించి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
భారీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడ గుమిగూడి లోపలికి చూస్తున్నారు. ఇంతలో మరో సిలిండర్ పేలి వారిపైకి దూసుకొచ్చింది. వేగంగా దూసుకొచ్చిన సిలిండర్ తగలడంతో నరేందర్ అలియాస్ నాని(18) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన యువకులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం గురించి తెలిసి కిషన్ రెడ్డి అక్కడకు వచ్చారు. ఆయన అలా పరిశీలించి ఇలా బయటకు వెళ్లగానే మరో సిలిండర్ పేలి బయటకు దూసుకు వచ్చింది. కిషన్ రెడ్డి మీదుగా శకలాలు ఎగిరిపడ్డాయి. త్రుటిలో ఆయనకు ప్రమాదం తప్పింది. ప్రమాద తీవ్రతను గుర్తించిన అధికారులు నింబోలి అడ్డాలోని బస్తీని ఖాళీ చేయించారు.