జగన్కు కందుల దుర్గేష్ షాక్, జనసేనలోకి: ఆ వ్యాఖ్యలే దెబ్బతీశాయా?
విజయవాడ: మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి, జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ఆయన శనివారం రాజమహేంద్రవరంలో మాట్లాడారు. తనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఎలాంటి విభేదాలు చెప్పారు. కానీ పార్టీ మారాలనుకుంటున్నట్లు తెలిపారు. జనసేన సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ద్వారా ప్రజలకు మేలు చేయవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు.

జనసేనాని వెంట నడుస్తాం
పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని కందుల దుర్గేష్ తెలిపారు. తామంతా జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తన సహచరులు, అనుచరులతో కలిసి తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానని, అనంతరం జనసేనాని వెంట నడుస్తానని చెప్పారు.

జగన్తో విభేదాల్లేవు కానీ, పని చేయలేకపోతున్నాం
తనకు జగన్తో రాజకీయపరమైన విభేదాలు లేవని కందుల దుర్గేష్ తెలిపారు. ఇతర ఏ అంశాల పైనా విబేధించి తాను రాజీనామా చేయడం లేదన్నారు. వైసీపీలో మేం అనుకున్న స్థాయిలో పని చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని, కేవలం ఈ కారణం వల్లే తాను వైసీపీని వీడుతున్నానని చెప్పారు.

ఆ కారణం వల్లే పార్టీని వీడుతున్నాం
గతంలో ఎమ్మెల్సీగా, ఆ తర్వాత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశామని, పని చేసే పరిస్థితి నుంచి పెద్దగా పని చేయల్సిన అవసరం లేనటువంటి లేదా చేసే అవకాశం లేని పరిస్థితుల్లోకి వచ్చామనే భావనతో వైసీపీ నుంచి బయటకు వస్తున్నామన్నారు. జనసేనలోకి వెళ్లేందుకు వారి నుంచి ఆహ్వానం వచ్చిందన్నారు. జనసేనలో చేరేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

ఆ వ్యాఖ్యలే కారణమా?
ఇటీవల కాపు రిజర్వేషన్లపై వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలు కాపు నేతలకు ఆగ్రహం తెప్పించాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ పెళ్లిపై ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. జగన్ వ్యాఖ్యలపై కాపుల్లో తీవ్ర ఆగ్రహం ఉందని కాపు నేతలు భావిస్తున్నారు. వైసీపీ కాపు నేతలు ఆందోళనగా ఉన్నారని అంటున్నారు. ఇందులో భాగంగా కందుల దుర్గేష్ పార్టీ వీడుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications