బెస్ట్ టేస్టుతో "పెసరపప్పు వడలు" ఎలా చేయాలంటే..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వేడి వేడి టీతో పాటు కరకరలాడే వడలు తినాలని చాలా మందికి అనిపిస్తుంది. ముఖ్యంగా మన బామ్మల కాలం నాటి సంప్రదాయ వంటల్లో పెసరపప్పు వడలకు ప్రత్యేక స్థానం ఉంది. బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ వడలు పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ లేదా చికెన్ గ్రేవీతో తింటే అద్భుతమైన రుచిని అందిస్తాయి. ఒకసారి తింటే ఒక్కటి, రెండుతో ఆగకుండా నాలుగు, ఐదు వడలు తినేస్తారు. పైగా పెసరపప్పుతో తయారయ్యే ఈ వడలు ప్రోటీన్లు, ఫైబర్ కూడా అందిస్తాయి.
పెసరపప్పులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిని అందించడంతో పాటు జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి. అయితే వడలు డీప్ ఫ్రై చేసినవి కావడంతో ఎక్కువగా తింటే గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్ సమస్యతో బాధపడేవారు పెసరపప్పు వడలను మితంగా తీసుకోవడం మంచిది. ఇంట్లోనే సులభంగా, కరకరలాడే పెసరపప్పు వడలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు..
పెసరపప్పు - 1 కప్పు
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 4
అల్లం - చిన్న ముక్క
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
కరివేపాకు - 8 నుంచి 10 ఆకులు (సన్నగా తరిగినవి)
కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (తరిగినది)
సగ్గుబియ్యం - 2 టేబుల్ స్పూన్లు (ఐచ్ఛికం)
బియ్యంపిండి - 1 టేబుల్ స్పూన్ (మరింత కరకరలాడేందుకు)
ఉప్పు - తగినంత
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం..
ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం 3 నుంచి 4 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పప్పు మెత్తబడటంతో పాటు వడలు బయట కరకరగా, లోపల మెత్తగా వస్తాయి.
నానబెట్టిన పెసరపప్పులోని నీటిని పూర్తిగా వంపేయాలి. ఇప్పుడు మిక్సీ జార్లో పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లం వేసి కొద్దిగా గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ( పిండిని పూర్తిగా మెత్తగా చేయకూడదు. కొద్దిగా గరుకుగా ఉంటే వడలు మరింత రుచిగా ఉంటాయి)
గ్రైండ్ చేసిన పిండిలో ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, సగ్గుబియ్యం, బియ్యంపిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. (సగ్గుబియ్యం, బియ్యంపిండి కలిపితే వడలు ఎక్కువసేపు కరకరలాడుతూ ఉంటాయి)
స్టవ్పై లోతైన పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. చేతికి కొద్దిగా నూనె రాసుకుని పిండిని చిన్న ఉండలుగా తీసుకుని వడల ఆకారంలో ఒత్తుకోవాలి.
వాటిని వేడి నూనెలో జాగ్రత్తగా వేసి మీడియం మంటపై వేయించాలి. ఒక వైపు బంగారు రంగు వచ్చిన తర్వాత మరో వైపు తిప్పి సమంగా వేయించాలి.
రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి టిష్యూ పేపర్పై ఉంచాలి.
కరకరలాడే పెసరపప్పు వడలను పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టమాటో చట్నీ, చికెన్ గ్రేవీ, మటన్ కర్రీ లతో తింటే రుచి మరింత పెరుగుతుంది.
చిట్కాలు..
పప్పును కనీసం 3 గంటలు నానబెట్టాలి.
గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు పోయకపోవడం మంచిది.
మీడియం మంటపైనే వేయించాలి. ఎక్కువ మంటపై బయట మాత్రమే కాలిపోతాయి.
పిండిలో కొద్దిగా సోంపు వేస్తే మంచి సువాసన వస్తుంది.
పచ్చిమిర్చితో పాటు మిరియాల పొడి కలిపితే మరింత కారంగా, టేస్టీగా ఉంటాయి.
సగ్గుబియ్యం వాడితే వడలు ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి.












Click it and Unblock the Notifications