మోదీకి వీడ్కోలు పలికిన మూగజీవాలు.. "నా మిత్రులు ముందే గ్రహించాయి"
జెన్ జీ స్టైల్లో ప్రధాని మోదీ పూర్తిగా సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. ఇటీవల ఆయన చేస్తున్న ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇందుకు నిదర్శనం. తాజాగా సోషల్ మీడియా స్టార్లు తమ డైలీ రొటీన్ ను పోస్ట్ చేసినట్లు మోదీ కూడా తన దినచర్యలో కీలక ఘట్టాన్ని మనముందుకు తీసుకువచ్చారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి కొద్ది నిమిషాల ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో అత్యంత ఆత్మీయమైన క్షణాలను గడిపారు.

7 లోక్ కల్యాణ్ మార్గ్లోని తన నివాస ప్రాంగణంలో రోజూవారీ దినచర్యలో భాగంగా నెమళ్లు, ఆవులకు ఆహారం తినిపిస్తున్న అరుదైన దృశ్యాలను ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న 80వ స్వాతంత్య్ర వేడుకల వేళ ఈ భావోద్వేగపూరిత వీడియో నెటిజన్ల మనసులను అమితంగా ఆకట్టుకుంటోంది.
ముందే గుర్తుపట్టి ఆత్మీయంగా వీడ్కోలు పలికిన మూగజీవాలు!
తన నివాసంలోని మూగజీవాలు తన కుటుంబ సభ్యులతో సమానమని ప్రధాని మోదీ తరచూ చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే వాటికి దాణా అందించడం ఆయన నిత్యకృత్యం. అయితే, స్వాతంత్య్ర దినోత్సవం కావడంతో ఎప్పటికంటే ముందే ఆయన ఎర్రకోటకు బయలుదేరాల్సి వచ్చింది. ఈ మార్పును గ్రహించినట్లుగా ఆవులు, అందమైన నెమళ్లు ఆయన కంటే ముందే దగ్గరకు వచ్చి వీడ్కోలు పలికాయని మోదీ పేర్కొన్నారు. "నా మిత్రులకు ఆహారం అందించడం రోజూ చేసేదే.. కానీ నిన్న ఉదయం నేను తొందరగా వెళ్తున్నానని గ్రహించి అవి నన్ను కలిసేందుకు వచ్చాయి" అంటూ ఆయన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు.
ప్రత్యేక ఆకర్షణగా పుంగనూరు జాతి ఆవులు!
పీఎం నివాసంలో కనిపిస్తున్న పశువులలో ఆంధ్రప్రదేశ్ ప్రాచీన, అరుదైన రకానికి చెందిన 'పుంగనూరు' జాతి ఆవులు కూడా ఉండటం గమనార్హం. వీటితో పాటు అందమైన నెమళ్లకు ఆయన సొంత చేతులతో ధాన్యాన్ని, దానాను అందిస్తున్న దృశ్యాలు ప్రధాని వ్యక్తిత్వంలోని మరొక భావోద్వేగ కోణాన్ని ఆవిష్కరించాయి. గతంలో కూడా ఆయన తన ప్రశాంతమైన ఉదయపు నడక సమయంలో వీటితో గడిపిన సందర్భాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.














Click it and Unblock the Notifications