ఇండియా కూటమిలోకి ఓవైసీ ? యూపీ ఎన్నికల వేళ కొత్త ట్విస్టులు..!
తాజాగా దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల ఆలోచనా విధానంలో పెను మార్పులు తీసుకొచ్చినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా విపక్షాల్లో బలంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ను వరుసగా బీజేపీ దెబ్బతీయడంతో సహజంగానే ఇండియా కూటమిని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యం పెరిగింది. దీంతో గతంలో కాంగ్రెస్ కు దూరంగా ఉన్న పార్టీలు సైతం ఇప్పుడు ఇండియా కూటమిలోకి వస్తామని సంకేతాలు ఇస్తున్నాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి (Asaduddin Owaisi) చెందిన ఎంఐఎం (AIMIM)సైతం ముందుకొచ్చింది.
ఈ ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అక్కడ వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీని గద్దె దింపేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ముఖ్యంగా గత లోక్ సభ ఎన్నికల్లో యోగీ ప్రభావాన్ని దాదాపుగా తగ్గించి, అయోధ్య వంటి స్ధానాల్లోనూ గెలిచి చూపించిన కాంగ్రెస్-సమాజ్ వాదీ పార్టీ కూటమిపై ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో 2022 ఎన్నికల్లో యూపీలో ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల్చుకోని ఎంఐఏం ఇప్పుడు మరోసారి విపక్ష కూటమితో చేతులు కలిపేందుకు సిద్ధమవుతోంది.

ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంకేతాలు ఇచ్చారు. బీజేపీని తిరిగి అధికారంలోకి రాకుండా చేసేందుకు విపక్షాలతో చేతులు కలిపేందుకు సిద్దమని ఓవైసీ ప్రకటించారు. తమకు తగిన గౌరవం, సమాన హోదా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న పార్టీలతో కలిసి పోరాడేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. తద్వారా ఇండియా కూటమికి తనను చేర్చుకోవాలని ఆయన సంకేతాలు ఇచ్చారు.

అయితే గతంలో పలు రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా బరిలోకి దిగి ఓట్లు చీల్చి బీజేపీకి మేలు చేసిన ఓవైసీని ఇండియా కూటమిలోకి చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఇష్టంగా లేనట్లు తెలుస్తోంది. ఓవైసీ పార్టీని ఇండియా కూటమిలో చేర్చుకోవడంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ ఇమ్రాన్ మసూద్ తెలిపారు. అయితే ఎస్పీ నేతలు మాత్రం బీజేపీని ఓడించేందుకు కలిసొచ్చే ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుంటామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో త్వరలో ఎంఐఎంను కలుపుకుపోవడంపై కాంగ్రెస్-ఎస్పీ క్లారిటీ ఇస్తాయని భావిస్తున్నారు.















Click it and Unblock the Notifications