కాంగ్రెస్ లో విలీనం దిశగా పిల్ల కాంగ్రెస్ లు..! జగన్ వైఖరి మారుతోందా ?
దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత ఇండియా కూటమి భేటీ నిర్వహించడం, అందులోనూ కూటమి బలోపేతం కంటే కాంగ్రెస్ (Congress) బలోపేతమే అన్నట్లుగా చర్చలు సాగడం వంటి పరిణామాలు అంతిమంగా అఖండ కాంగ్రెస్ భావనను మళ్లీ తెరపైకి తెస్తున్నాయి. దీంతో ఒకప్పుడు వివిధ కారణాలతో కాంగ్రెస్ ను వీడిపోయి సొంత కుంపట్లు పెట్టుకున్న పార్టీ అధినేతలపై ఇప్పుడు అందరి దృష్టీ పడుతోంది.
తృణమూల్ కాంగ్రెస్
బెంగాల్లో తాజాగా ఎదురైన ఓటమి కంటే కూడా ఆ తర్వాత టీఎంసీ నేతలంతా బీజేపీలోకి తరలి వెళ్లిపోతుండటం మమతా బెనర్జీని ఎక్కువగా కలవరపెడుతోంది. ఇదే పరిస్ధితి కొనసాగితే టీఎంసీలో మమత, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తప్ప ఎవరూ మిగిలేలా కనిపించడం లేదు. దీంతో మమతా బెనర్జీ సహజంగానే ఇన్నాళ్లూ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మాజీ బాస్ సోనియా గాంధీని మమతా బెనర్జీ, ప్రస్తుతం అన్నీ తానే నడిపిస్తున్న కీలక నేత రాహుల్ గాంధీని అభిషేక్ బెనర్జీ కలిసి తమ పార్టీని విలీనం చేసేందుకు సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు. పైకి లేదని చెప్తున్నా అంతర్గతంగా ఇవే చర్చలు సాగినట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ
గతంలో కాంగ్రెస్ లో ప్రధాని పదవి రాదని తెలుసుకుని విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని పెట్టుకున్న శరద్ పవార్ కు ఇప్పుడు మహారాష్ట్రలో ఏదీ కలిసి రావడం లేదు. గత మహారాష్ట్ర ఎన్నికలకు ముందే శివసేనతో పాటు తమ పార్టీని సైతం చీల్చి వేరు కుంపట్లు పెట్టించిన బీజేపీ.. ఎన్నికల్లోనూ వారితోనే వెళ్లి ఘన విజయం సాధించింది. కానీ అసలు శివసేన, ఎన్సీపీలు మాత్రం ఓడిపోయాయి. దీంతో ఇప్పుడు ఎన్సీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు పవార్ పావులు కదుపుతున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగానే ఉంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తన తండ్రి వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత సీఎం పదవి ఇవ్వలేదని కాంగ్రెస్ తో విభేదించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్దాపించిన వైఎస్ జగన్.. పదేళ్లలో అందుకు తగ్గ ఫలితం అందుకున్నారు. 2019 ఎన్నికల్లో భారీ విజయం సాధించి ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపారు. కానీ గత ఎన్నికల్లో బీజేపీ మద్దతున్న టీడీపీ-జనసేన కూటమిని తట్టుకోలేకపోయారు. దీనికి కారణం బీజేపీ అని జగన్ కూ తెలుసు. దీంతో ఈవీఎంల ద్వారా తమను ఓడించారని ఇప్పటికే పలుమార్లు చెప్పుకున్నారు. తాజాగా బెంగాల్, తమిళనాడు ఫలితాలపైనా జగన్ ఓట్ల చోరీ వ్యాఖ్యలు చేసారు. దీంతో జగన్ కూడా భవిష్యత్తులో తిరిగి కాంగ్రెస్ గూటికి చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ తో జగన్ బద్ధ శత్రుత్వం నెరుపుతున్నారు. కానీ వచ్చే ఏడాది పాదయాత్ర మొదలుపెట్టాక పరిస్ధితులు మారకపోతే మాత్రం కాంగ్రెస్ వైపు జగన్ చూసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications