ఉప్పాడ తీర రక్షణకు రంగంలోకి IIT మద్రాస్- మాట నిలబెట్టుకుంటున్న పవన్ ..!
ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నియోజకవర్గం పిఠాపురం పరిధిలోకి వచ్చే ఉప్పాడ (Uppada) గ్రామానికి సముద్ర కోత ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఉప్పాడ వాసులు ఇప్పటికే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల సమయంలో వారి సమస్యకు పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చిన పవన్ .. ఇప్పుడు ఐఐటీ మద్రాస్ (IIT Madras) ను రంగంలోకి దింపారు. ఈ మేరకు ఉప్పాడ తీర రక్షణ విషయంలో ఏపీ ప్రభుత్వానికి (AP govt) సహకారం అందించేందుకు ఐఐటీ మద్రాస్ ఇవాళ ఓ ఒప్పందం కుదుర్చుకుంది.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరం సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బ తింటున్న నేపథ్యంలో ఇక్కడ రక్షణ కోడ నిర్మించేందుకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటీ -మద్రాస్కు ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రూ.323 కోట్లతో ఈ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం చేపట్టబోతున్నారు. కేంద్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ నిధి సహకారంతో చేపట్టనున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. అలాగే నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా ఏపీ మారిటైమ్ బోర్డు బాధ్యతలు నిర్వహిస్తుంది.

ఐఐటీ మద్రాస్ నిపుణుల సాంకేతిక సూచనలు, శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా ఉప్పాడ తీర ప్రాంతానికి అనువైన రక్షణ చర్యలను రూపొందిస్తారు. తీర కోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావం వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి అనుగుణంగా తీర రక్షణ నిర్మాణాల డిజైన్ను సిద్ధం చేస్తారు. ఐఐటీ మద్రాస్తో ఒప్పందం పూర్తికావడంతో వచ్చే నవంబర్ నుంచి ప్రాజెక్టు పనులను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఉప్పాడ ప్రజలు, మత్స్యకార గ్రామాల రక్షణకు ఈ ప్రాజెక్టు చాలా కీలకం.













Click it and Unblock the Notifications