ఆబ్కారీ కానిస్టేబుల్ హత్య: ప్రియుడితో కలిసి భార్య చేసిన పనేనా?
ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నగరంలోని అన్నవరప్పాడు రెండవ లైనులో నివాసం ఉంటున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ షేక్ మహమ్మద్ రఫీ (45) సోమవారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే రఫీ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుడ్లూరు మండలం దప్పలంపాడు గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీతో ఉలవపాడుకు చెందిన షేక్ రేష్మాతో వివాహమైంది. మహమ్మద్ రఫీ చీరాలలో ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఒంగోలులోని అన్నవరప్పాడు కాలనీలో గత రెండేళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇటీవలి కాలంలో భార్యాభర్తలకు మధ్య తరుచుగా వివాదం జరుగుతూ వస్తోందని సమాచారం. ఈ క్రమంలో ఆదివారం రాత్రి రఫీ తనింట్లో నిద్రిస్తుండగా తెల్లవారుజామున ప్రియుడితో కలిసి రఫీని భార్య రేష్మా రోకలిబండతో తలపై కొట్టి హతమార్చి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.
రఫీ భార్య రేష్మాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడుని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.