అలా చేస్తే అదనంగా 5మార్కులు: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులకు ఓ తీపి కబురును అందించింది. అదేమంటే.. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో భాగస్వాములయ్యే విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో 5 మార్కులు అదనంగా వేయాలని నిర్ణయించింది.
9వ తరగతి, ఆ పైన చదువుతున్న విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొంటే వారికి ఈ అదనపు మార్కులు జత చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏపీలో 21లక్షల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
మరుగుదొడ్లు లేని ఇళ్లను గుర్తించి అందరూ మరుగుదొడ్లను నిర్మించుకునేలా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ మురళీధర్ కోరారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు మరుగుదొడ్ల డిజైన్ రూపొందించేలా, వైద్య విద్యార్థులు పారిశుద్ధ్యంపై ప్రజలు చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు.